ఇల్లందకుంట, జనవరి 24: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయని ఏవో గుర్రం రజిత సూచించారు. సోమవారం మల్యాల గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. రైతులు సాగు చేసిన మక్క పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. వరికి బదులు మక్కలు, నువ్వులు, మినుములు, కందులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులతోపాటు లాభాలు వస్తాయన్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ శాఖాధికారుల వద్ద పంటల వివరాలను నమోదు చేసుకుంటే, మార్కెట్ల్లో విక్రయించడానికి సులువుగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఏఈవోలు సంపత్, మహేందర్, మౌనిక, రాకేశ్, రైతులు ఉన్నారు.
సేంద్రియ సాగుతో అధిక లాభం
సేంద్రియ విధానంతో పంట సాగు చేస్తే ఖర్చు తగ్గి అధిక లాభం చేకూరుతుందని ఏఈవో గట్టు తిరుపతి రైతులకు సూచించారు. విలాసాగర్లో సోమవారం ఏఈవో పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకుని నమోదు చేశారు. అనంతరం పంట సాగులో సేంద్రియ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. వర్మి కంపోస్ట్, వేపనూనె, పశువుల పేడ తదితర సహజ సేంద్రియ ఎరువులను వినియోగించుకుని ఖర్చుతగ్గించుకోవచ్చన్నారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి వస్తుందని చెప్పారు.