కరీంనగర్ రూరల్, జూలై 31: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మండలంలో మొత్తం 16192 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 10837 ఎకరాల్లో వరి, 4300 ఎకరాల్లో పత్తి, 854 ఎకరాల్లో మొక్కజొన్న. 48 ఎకరాల్లో పెసర, 72 ఎకరాల్లో కందులు, 81 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ముందస్తుగా వేసిన వరి, కూరగాయలు తదితర పంటలు ఇటీవల కురిసిన వానలకు దెబ్బతిన్నాయి. ఆలస్యంగా పంటల సాగుచేసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వానలు ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు 60 శాతం కావాల్సిన నాట్లు, 30 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు రైతులు పేర్కొన్నారు. యూరియా, అడుగు మందులు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, ఫర్టిలైజర్ షాపులో నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సస్యరక్షణ చర్యలు, చీడపీడల నివారణపై రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. పంటల సాగులో మెళకువలు పాటించాలని మండల వ్యవసాయాధికారి సత్యం సూచించారు. భూసార పరిస్థితులకు అనుగుణంగా భాస్వరం, పొటాషియం, యూరియా వినియోగించాలని తెలిపారు.
హుజూరాబాద్టౌన్, జూలై 31: రెండు వారాల క్రితం వరకు తీవ్ర ఎండలతో మండలవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పట్టణంతో పాటు దమ్మక్కపేట, ఇప్పల్నర్సింగాపూర్, బోర్నపల్లి, మండలంలోని 19 గ్రామాల్లో తొలకరి వర్షాలకు 200 ఎకరాల్లో పత్తి విత్తనాలు, 70 ఎకరాలల్లో మక్కజొన్న, 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు వేసిన రైతులు వర్షం జాడ లేక తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలు జీవం పోసుకున్నాయి. చెరువులు, కుంటలు సమృద్ధిగా నిండగా, బోరు బావులు, మోటర్ల కింద ముందుగా నార్లు పోసిన రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో 22వేల ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమవగా ముందుగా నారు పోసిన రైతులు ఇప్పటికే 13వేల ఎకరాల్లో వరినాట్లు మొదలు పెట్టారు. గోదావరి నది ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండడంతో ఎస్సారెస్పీ కాల్వలకు నీరు విడుదల అవుతుందనే నమ్మకంతో బోరుబావుల ఆధారం లేని రైతులు సైతం నారు పోసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే తమ ఖాతాల్లో రైతుబంధు నిధులు పడడంతో ఎరువుల బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతన్నకు ఎంతో మేలు చేశాయి.