ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఆదివారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. క్షణంపాటు తెరిపిలేకుండా.. అడుగుతీసి బయటవేసే అవకాశమే లేకుండా కుంభవృష్టిగా కురిసింది. వదలని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు, కుంటలన్నింటికీ జలకళ వచ్చింది. వర్ష బీభత్సానికి పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు యువకుడు మృత్యువాతపడడం కలిచివేసింది. ఇక మానేరుకు వరద పోటెత్తుండడంతో ఎస్సారార్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరుగుతుండగా, అటు జగిత్యాల జిల్లా ధర్మపురి వద్దా గోదావరికి వరద పోటెత్తుతున్నది. అయితే, మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. లోతట్టు, నదీపరివాహక ప్రజలను అప్రమత్తం చేస్తున్నది.
కార్పొరేషన్, సెప్టెంబర్ 3: వర్షం దంచికొట్టింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. చెరువులు, కుంటలు, చెక్డ్యాంల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. కాగా, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని మంకమ్మతోట, విద్యానగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన కాలువలన్నీ పొంగిపొర్లాయి. రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రిజ్వాన బేగం అనే మహిళలకు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి 3వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, 27.55 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 20.07 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.అత్యవసర సమయంలో 100కి డయల్ చేయాలని ఆదేశించారు. కాగా, పిడుగు పడి జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్కు చెందిన పడిగే సతీశ్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు.