ప్రజా సంక్షేమమే కాదు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణంగా వచ్చే డెంగీ, విష జ్వరాలతోపాటు డయేరియా, మలేరియా ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ పారిశుధ్యం, వైద్య పరీక్షలు, నీటి క్లోరినేషన్ వంటి పనులు చేపడుతున్నది. కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తోపాటు వివిధ శాఖల అధికారులు ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల తర్వాత వచ్చే వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరదల ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఏర్పడిన బురదను తొలగించడం, డ్రైనేజీల్లో పూడిక తీయడం, రోడ్లపై, ఇతర లోతట్టు ప్రాంతాలు, గుంతల్లో నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా చేయడం, మురుగు నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయడం వంటి పారిశుధ్య పనులను చేపడుతున్నారు. పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పనులు వేగంగా జరుగుతున్నాయి. అత్యధిక వర్షం కురిసిన గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు గండి కొట్టిన నేపథ్యంలో ఇక్కడి ఎస్సీ కాలనీ, ఇస్తారిపల్లె గ్రామాలు వరద ప్రభావానికిలోనయ్యాయి. వరద వెళ్లిన మరునాటి నుంచి అక్కడి అధికారులు గ్రామంలో ఏర్పడిన బురదను పూర్తిగా తొలగించారు. వీధుల్లో శానిటేషన్ చేసిన తర్వాతనే ఇక్కడి ప్రజలకు గ్రామంలో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. ఇలా ప్రతి గ్రామంలో వర్షాల కారణంగా ఎదురైన సమస్యలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. డీపీఓ వీరబుచ్చయ్యతోపాటు డీఎల్పీలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉన్న పారిశుధ్య సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నారు. ఇటు మున్సిపాలిటీల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన పారిశుధ్య సమస్యను సంబంధిత అధికారులు వెంట వెంటనే పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి జ్వరాలు వచ్చిన వారిని గుర్తించి మందులు అందిస్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. డెంగీ, విష జ్వరాల ప్రభావం కనిపించిన ప్రతి చోట పంచాయతీ, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నారు. అక్కడక్కడా డెంగీ, వైరల్ ఫీవర్లు కనిపిస్తుండగా, డీఎంహచ్ఓ జువేరియా స్వయంగా వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా గ్రామాల్లోని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులతో బృందాలు ఏర్పాటు చేసి వర్షాల తర్వాత వచ్చే అంటు, ఇతర వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవరస పరస్థితులు ఏర్పడినట్లయితే తక్షణ వైద్య సాయం అందించేందుకు ఏడు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో ఈ బృందాలను అందుబాటులో ఉంచారు. జ్వరాలు సోకినా, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వ దవాఖానాలకు పంపిస్తున్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లందరికీ మండల స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎమర్జెన్సీ సెక్షన్కు సమాచారం ఇవ్వాలని, 9849902501 నంబర్కు కాల్ చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు.
నీటి పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు..
కలుషిత నీరు ప్రజలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు జిల్లాలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మిషన్ భగీరథ ఎస్ఈ చంద అమరేంద్ర తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా పైప్లైన్ల లీకేజీలు ఉంటే తక్షణమే పంచాయతీ సిబ్బంది సహకారంతో మిషన్ భగీరథ అధికారులు అరికడుతున్నారు. నీటి స్టోర్స్లో, ఓహెచ్ఆర్సీల్లో క్రమం తప్పకుండా క్లోరినేషన్ పాటిస్తున్నారు. అంతే కాకుండా మిషన్ భగీరథ నీటిని ఎలా వాడుకోవాలో తెలిపేందుకు మిషన్ భగీరథ క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాచి వడబోసిన నీటినే తాగాలని, నీటి కుళాయిలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటి నీళ్లు అపుడే వాడుకోవాలని, నీటిని రోజుల తరబడి నిలువకు ఉంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు మిషన్ భగీరథ అధికారులు తర్ఫీదు ఇచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.