కోరుట్ల, ఏప్రిల్ 5: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే బీజేపీ దుష్ట పన్నాగాలకు తెరతీసిందని, రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు దుర్మార్గమైన చేష్టలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జిల్లా ఇన్చార్జి కోలేటి దామోదర్ గుప్తా మండిపడ్డారు. బీజేపీ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తన శిష్యుడితో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ చేయించాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం డెరెక్షన్లోనే ఈ బాగోతం నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని మోడీ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష కట్టిందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కేంద్రంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రముఖ పాత్ర వహించిన సంజయ్పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక్కడ మెట్పల్లి మున్సిపల్ అధ్యక్షురాలు సుజాత, ఉపాధ్యక్షుడు చంద్ర శేఖర్రావు, ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ ఉన్నారు.