తిమ్మాపూర్, మే 23: పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ ఇప్పుడు హరితహననంగా మారిపోయింది. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుని అప్పటి సర్కారు పచ్చదనం పెంపునకు కృషి చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడికక్కడ ఎండిపోతుండడం, నరికి వేస్తుండడంపై ఈ నెల 21న ‘హరితహననం‘ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
దీనికి కలెక్టర్ పమేలా సత్పతి స్పందించి, నివేదిక ఇవ్వాలని తిమ్మాపూర్ ఎంపీడీవో విజయ్ కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన గురువారం రంగంలోకి దిగారు. మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శుల నుంచి ఎక్కడెక్కడ హరితహారం చెట్లను నరికారు? అందుకు గల కారణాలతో నివేదిక తీసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను నరికినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో హరితహారం మొక్కలను, చెట్లను సంరక్షించాలని కార్యదర్శులకు అధికారులు సూచించారు.