మల్యాల, ఏప్రిల్ 6: రామ లక్ష్మణ జానకీ..జై బోలో హన్మాన్కీ.., శ్రీరామ జయ రామ, జయ జయ రామ అను రామ నామ’ సంకీర్తనలతో కొండగట్టు మార్మోగింది. ఉప్పెనలా తరలివచ్చిన దీక్షాపరులతో కొండంతా కషాయశోభితమైంది. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో చిన్న జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు చిన్న జయంతి సందర్భంగా ఆలయంలో స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ చేశారు. ఈ జయంతి సందర్భంగా వేలాదిమంది భక్తులు, దీక్షాపరులు తరలివచ్చి స్వామి వారిని దర్శించకున్నారు. చిన్న జయంతి రోజున దీక్షాపరులు కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తారు. ఈ క్రమంలో బుధవారం సూర్యాస్తమయం నుంచి భక్తుల రాక పెరిగింది. అర్ధరాత్రి వరకు వేలాది మంది దీక్షాపరులు గుట్టపైకి చేరుకున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి కాలికనడకన కొండగట్టుకు చేరుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.అర్ధరాత్రి నుంచి మొదలైన మాల విరమణ కార్యక్రమం గురువారం ఉదయం వరకూ సాగింది. ఈ సందర్భంగా దీక్షాపరులతో కొత్త కోనేరు, మాల విరమణ మండపాలు కిక్కిరిసి పోయాయి. అనంతరం భక్తులు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించకున్నారు. కాని చిన్న జయంతి సందర్భంగా సాధారణ భక్తులు, దీక్షాపరులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఎస్పీ ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డితో పాటు డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలక మండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామి, సిబ్బంది భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.