సిరిసిల్ల టౌన్, ఆగస్టు 5: సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తనదైన శైలిలో నేతకళను ప్రదర్శించాడు. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయను న్న నేతన్న బీమా పథకంపై అద్భుతమైన ప్రతిభతో వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపాడు. వారంరోజుల పాటు శ్రమించి మరమగ్గంపై ప్రత్యేకమైన చీరను తయారు చేశాడు.
ప్రభుత్వం అమలుచేయనున్న పథకాన్ని స్వాగతిస్తూ చీరపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేతన్న చిత్రాలతోపాటు పథకాన్ని వివరిస్తూ అక్షరాల రూపాలతో కూడినచీరను తయారుచేసి ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, షర్ట్లతోపాటు ఎన్నో అద్భుతమైన కళారూపాలను చీరపై నేసిన హరిప్రసాద్ నేతకార్మికుల కోసం ప్రభు త్వం ప్రవేశపెడుతున్న నేతన్న బీమా పథకాన్ని స్వాగతిస్తూ తయారుచేసిన చీరను చూసిన స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు. మంత్రి కేటీఆర్కు ఈ చీరను అందజేసి కృతజ్ఞతలు తెలుపుతానని హరిప్రసాద్ చెబుతున్నాడు.