గంభీరావుపేట/ వీర్నపల్లి, మార్చి16: ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్ల, గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది.
గులకరాళ్ల కంటే పెద్దసైజులో వడగండ్లు పడడంతో చేతికచ్చిన వరిపంట నేలపాలైంది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కోతలు మొదలు పెడుదామనుకుంటే ఇలా జరగడంపై కంటతడిపెట్టుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.