సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 25: స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో బాలికల గురుకుల పాఠశాలలో తొలిసారిగా 8వజోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ను పవర్లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడారు.
క్రీడలతోనూ వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. చ దువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో గురుకులాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. చదువు, క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ అద్భుతమైన ప్రగతిని సాధించాయన్నారు. తొలిసారిగా జోనల్ స్థాయి క్రీడలు జిల్లా వేదికగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గురుకులాల విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభచూపడం హర్షణీయమన్నారు. అంతకుముందు పవర్లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ జోనల్ క్రీడా పోటీలు జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందని, విజయవంతంగా ముగించుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఇక్కడ డీసీవో జాక్వలిన్, బద్దెనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, సీఐ ఉపేందర్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ అధికారి లక్ష్మి రాజం, ఎంపీటీసీ సిలువేరి ప్రసూన ఉన్నారు.