గన్నేరువరం, నవంబర్ 28 : కాంగ్రెస్ను నమ్మితే ప్రజల బతుకులు ఆగమవుతాయని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో పీక్కు తింటున్నారని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులతో కలిసి మండలంలోని గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు 17 కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ తీశారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్లో దవాఖానలు పెట్టి దోచుకున్న డబ్బులతో వచ్చి డబ్బు సంచులతో నాయకులను కొనాలని చూస్తున్నరని, కానీ మానకొండూరు ప్రజలను కొనలేరని స్పష్టం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ ఏవో మాయమాటలు చెప్తూ అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాని, కరెంట్ కావాలో? కాంగ్రెస్ కావాలో? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ గ్యారెంటీలు ఏమోగానీ ఆర్నెళ్లకు ఒక సీఎం మారుడు పక్కా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాకముందు వ్యవసాయం దండుగ అన్నారని, కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసిండన్నారు. సమైక్య పాలనలో కూలి పని దొరికేది కాదని, నేడు కూలీలు దొరకడం లేదన్నారు. తాను అభివృద్ధి చేశానని, మరోసారి పట్టం కట్టాలని కోరారు.
తెలంగాణచౌక్, నవంబర్ 28: బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్కు కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెన్సీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నగరంలోని ప్రెస్ భవనంలో మంగళవారం అసోసియేషన్ అధ్యక్షుడు సుప్రీం జావిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. గంగుల గెలుపు కోసం అసోసియేషన్ తరఫున కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ నాయకులు హఫీజ్, అహ్మద్, ముబీన్ పాల్గొన్నారు.
కొత్తపల్లి, నవంబర్ 28 : పంజాబ్లోని చండీఘడ్ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే సౌత్, వెస్ట్ రెజ్లింగ్ యూనివర్సిటీ పోటీలకు కరీంనగర్లోని గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులు నితిన్, గణేశ్ ఎంపికైనట్లు పీడీ ఎండీ సర్వర్ పేర్కొన్నారు. కళాశాలలో మంగళవారం విద్యార్థులను ప్రిన్సిపాల్ లావణ్య, పీడీ, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
కలెక్టరేట్, నవంబర్ 28: ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, ఆమె హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఇతర అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
రాంనగర్, నవంబర్ 28: కరీంనగర్ కమిషనర్ కేంద్రంలో గల పరేడ్ గ్రౌండ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బందికి, స్థానిక హోంగార్డులకు ఎన్నికల విధులపై మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అవగాహన కల్పించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అడిషనల్ డీసీపీలు రాజు, లక్ష్మీనారాయణ, ఏసీపీ నర ప్రతాప్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్ బాబు, రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, సురేశ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
రాంనగర్, నవంబర్ 28: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు. పోలింగ్ మొదలయ్యే రోజు ముందు నుంచి దాదాపు 3000 మంది సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. క్లిష్టమైన ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు తలెత్తినా స్పందించేందుకు ప్రత్యేక యాక్షన్ టీమ్లను కూడా నియమించామని తెలిపారు.
అన్ని కీలకమైన పోలింగ్ స్థానాలు కేంద్ర పారా మిలిటరీ బలగాల పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 144 సీఆర్పీసీ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు కాని బయటి వ్యక్తులెవరూ ప్రచార వ్యవధి ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఉండొద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు, అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.