సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 27: ఏజెంట్ మోసంతో గల్ఫ్ దేశంలో చిక్కుకున్న తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీశ్ ఎట్టకేలకు సోమవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. తనను స్వదేశానికి తీసుకువచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నకు తాను జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. బస్వాపూర్కు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీశ్ రెండు నెలల క్రితం గల్ఫ్ దేశమైన ఓమన్ (మస్కట్)లో ఏజెంట్ మోసంతో చిక్కుకున్నాడు.
ఆరోగ్యం సహకరించక పోవడంతో పని చేయలేక దయనీయ పరిస్థితిలో తనను స్వదేశానికి తీసుకెళ్లాలని, ఏజెంట్ మోసం, కంపెనీ నిర్వాహకుల వేధింపుల గురించి సోషల్ మీడియాలో తనగోడు వెల్లబోసుకున్నాడు. గౌరయ్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ తెలుసుకున్నారు. గౌరయ్యను స్వదేశానికి తీసుకువచ్చేలా ఈ నెల 12న ఓమన్ ఎంబీసీకి లేఖ రాశారు. అక్కడే ఉన్న సామాజిక సేవా కార్యకర్త షేక్అహ్మద్ని సైతం న్యాయసాయం చేయాలని కోరారు.
ఈ క్రమంలో షేక్అహ్మద్ వెంటనే కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపగా, కంపెనీ ప్రతినిధులు ఒప్పుకొని గౌరయ్యకు పాస్పోర్టు తిరిగి అందించారు. గౌరయ్యను స్వదేశానికి తీసుకు రావడానికి విమాన ఖర్చుల కోసం కేటీఆర్ నగదు పంపించారు. దీంతో గౌరయ్య ఆదివారం అక్కడ నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు శ్రీధర్, గడ్డం శేషాది ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ఉదయం 10గంటలకు కారులో బస్వాపూర్లోని ఇంటికి తీసుకెళ్లారు. భార్య శారద, కొడుకు వరుణ్తేజ్, కూతురు అవంతికను చూడగానే గౌరయ్య భావోద్వేగానికి గురైకన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్వదేశానికి తీసుకువచ్చిన మాజీ మంత్రి కేటీఆర్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నాడు. సహకరించిన సామాజిక సేవా కార్యకర్త షేక్అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు శ్రీధర్, గడ్డం శేషాద్రి, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.