పెద్దపల్లిలో అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు
మేళ తాళాలు.. బాజా భజంత్రీలు.. భారీ పందిళ్లు.. ఇటు వేదమంత్రోచ్ఛరణల మధ్య పెంట రాజేశ్ దంపతులు పెండ్లి పెద్దలుగా పెద్దపల్లిలో సామూహిక వివాహాలు అంగరంగవైభవంగా జరిగాయి. బుధవారం ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఏకకాలంలో ఎనిమిది జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి సహా ఇతర ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. గరీబోళ్ల బిడ్డల పెండ్లిలకు అన్నీ తానై వివాహం చేస్తూ అండగా నిలుస్తున్న రాజేశ్-సుగుణ దంపతులను అభినందించారు.
పెద్దపల్లి కమాన్, మే 25 : సామాజిక సేవే కాదు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లోని యువతుల వి వాహాలకు అండగా నిలుస్తున్నారు ‘ఆసరా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు, సా మాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎనిమిది జంటలకు ఒకేసారి సామూహిక వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. వధూవరులకు నూతన వస్ర్తాలు, పుస్తె మట్టెలు పెట్టి, ఆడబిడ్డల తరపున వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఈ సందర్భంగా పెంట రాజేశ్ మాట్లాడుతూ నిరుపేదలకు సాయం చేయాలనే సంకల్పంతో ఆరేళ్ల కిందట ఆసరా ఫౌండేషన్ను స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 101 జంటలకు సామూహిక వివాహాలు జరిపించామని పేర్కొన్నారు.
ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని సేవలందిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గరీబోళ్ల పెళ్లిలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న సామాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులను అభినందించారు. అనంతరం నూతన వధూవరులతో రాజేశ్ దంపతులు సహపంక్తి భోజనం చేశారు. కల్యాణ వేడుక సందర్భంగా సుమారు 4వేల మందికి విందు ఇచ్చారు. అప్పగింతల కార్యక్రమంలో భాగంగా పెండ్లి కూతుళ్లను అత్తగారింటికి సాగనంపారు. వేద పండితులు కొండపాక శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో అర్చకుడు సామూహిక వివాహ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.