సీఎం కేసీఆర్ మది నుంచి పుట్టుకొచ్చిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో జగిత్యాల జిల్లా నాన్ కమాండ్ ఏరియాలోని మండలాల్లో గతంలో నెలకొన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. రిజర్వాయర్గా మారిన వరదకాలువకు తూములు ఏర్పాటు చేసి, చెరువులన్నీ నింపడంతో పాతాళంలో ఉన్న గంగ పైపైకి వచ్చి కరువు ఛాయలను తుడిచేసింది. కాళేశ్వర జలాలు బీడు భూములను తడిపేసి సస్యశ్యామలం చేశాయి. ప్రస్తుతం 2 మీటర్ల లోతులోనే నీళ్లు ఉండడంతో రైతాంగం సిరులు పండిస్తూ పండుగ చేసుకుంటున్నది.
నాడు..
పక్కనే వరద కాలువ ఉన్నా.. నెర్రెలు బారిన నేలలు, ఎడారిని తలపించిన చెరువులు, సాగుకే కాదు కనీసం తాగడానికి నీళ్లు లేక ఎండిన గొంతులు.. ఇవీ తెలంగాణ రాక ముందు పరిస్థితులు.
నేడు..
ఏడాది పొడవునా వరద కాలువలో నీళ్లు.. ఎటు చూసినా పచ్చని పొలాలు.. నిండుకుండల్లా చెరువులు.. గుంట ఎండిపోకుండా పుష్కలమైన సాగునీరు.. తాగేందుకు స్వచ్ఛమైన శుద్ధజలం.. ఇవి నేటి దృశ్యాలు..
జగిత్యాల, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణ వరదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా నిర్మించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాలక్రమేణా తన సామర్థ్యాన్ని కోల్పోయింది. 1994లో 90.30 టీఎంసీలకు, 2013లో 80.13 టీఎంసీలకు కుచించుకు పోయింది. మొత్తంగా 31 టీఎంసీల నీటి నిల్వను కోల్పోయి, 28శాతం సామర్థ్యం తగ్గిపోయిందని నిపుణులు ప్రకటించారు. ఎగువన మహారాష్ట్ర గోదావరినదిపై కట్టిన అనేక చెక్డ్యామ్లు, ప్రాజెక్టుల వల్ల గోదావరిలో నీటి లభ్యత సైతం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకొని, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని ఎత్తిపోసే బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. 2017 ఆగస్టు 10వ తేదీన ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్దే ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. దాదాపు రూ. 1,999 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మొదలైంది. 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరద కాలువపై మూడు పంప్ హౌస్ల నిర్మాణం చేపట్టారు. జగిత్యాల జిల్లాలో రాంపూర్-రాజేశ్వర్రావుపేటలో రెండు పంప్హౌస్లు, నిజమాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద మరో పంప్హౌస్ నిర్మాణం చేపట్టారు. శరవేగంతో ఈ పథకం పనులు చేపట్టారు. 2017లో ప్రారంభమైన పనులు 2019 వరకు రాంపూర్, రాజేశ్వర్రావుపేట వరకు పూర్తయ్యాయి. దీంతో 2020 నుంచి వరద కాలువ ద్వారా నీటిని రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ల వరకు తరలించడం మొదలైంది. ఇటీవలే ప్రాజెక్టు పూర్తి కావచ్చింది.
దశ మార్చిన పునర్జీవ పథకం
జగిత్యాల జిల్లాలో నాన్ కమాండ్ ఏరియాలుగా పేరుపడిన కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి మండలాల దశ, దిశను ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మార్చివేసింది. 2019 నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వరద కాలువల్లోకి రావడం, వరద కాలువకు తూములు ఏర్పాటు చేసి ఆ తూముల గుండా, 5 మండలాల్లోని 32 చెరువులను నింపుకునే అవకాశాన్ని కల్పించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏడాదిలో దాదాపు 9 నెలలు వరద కాలువ రిజర్వాయర్గా ఉండడం, దీని ద్వారా చెరువులను నింపుతుండడంతో నాన్ ఆయకట్టు మండలంలోని భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోయాయి. 2019 నుంచి వరద కాలువ ద్వారా రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ల వరకు నీరు వస్తుండడంతో భూగర్బజలాలు వృద్ధి చెందాయి. ఒకప్పుడు ఏడాదిలో ఏ మాసంలో చూసినా సగటున ఏడెనిమిది మీటర్ల లోతున ఉండే భూగర్భజలాలు ఇప్పుడు ఎప్పుడు చూసినా మూడు, నాలుగు మీటర్ల లోతునే ఉంటున్నాయి. కమాండ్ ఏరియాలో ఉన్న మండలాల కంటే తక్కువ లోతున నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న మండలాల్లోని భూగర్భజలాలు ఉండడం గమనార్హం.
మా జీవితాలకు వెలుగునిచ్చిన్రు
సీఎం కేసీఆర్ మా జీవితాలకు వెలుగునిచ్చారు. పదేం డ్ల క్రితం వరకు మా బతుకులు ఘోరంగా ఉండేవి. మా పల్లెల్లో నీళ్లు పాతాళంలో కనిపించేవి. ఎస్సారెస్పీ కాలువ పైకి ఉండటం మాకు శాపం అయ్యింది. వరద కాలువ తవ్వినా, దానికి తూములు పెట్టకపోవడంతో మాకు అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు తూములు పెట్టి చెరువులు నింపాలని అడిగినా, సమైక్య పాలకు లు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ వరద కాలువకు తూములు పెట్టించడంతో మా దశ మారింది. రివర్స్ పంపింగ్తోటి మా జీవితాలకే వెలుగు వచ్చింది. ఇప్పుడు మా పల్లెల్లో ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి. చెరువులు నిండాయి. కరెంట్ మోటర్లు పోస్తున్నాయి. వ్యవసాయం పెరిగింది. మేము సంతోషంగా ఉన్నామంటే దానికి సీఎం కేసీఆర్ కారణం.
-జవిడి ప్రతాప్రెడ్డి, సర్పంచ్ పెగ్గెర్ల, కథలాపూర్ మండలం
మా ఉదకమ్మ నిండుకుండైంది..
మా ఊరిలో మా ఉదకమ్మ మళ్లీ ఉబికి వచ్చింది. ఇక మాకు తిరుగులేదు. మా వ్యవసాయానికి ఢోకా లేదు. ఒకప్పుడు మా ఊళ్లే ఉదకమ్మ చెరువు నిండితే ఊరంతటికి మంచి జరుగుతుండెనట. .మా ఏరుకల ఎప్పుడు ఉదకమ్మ చెరువు నిండ లేదు. వరద కాలువ తవ్వినంక దాంట్ల నీళ్లు పారించి మా ఉదకమ్మ చెరువు నింపుతరు అనుకున్నం.. అడిగినం.. అయినా సర్కారు ఇవ్వలేదు.. నిరాశపడ్డం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినం.. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ మొదలుబెట్టడం, వరద కాలు వను రిజర్వాయర్ లెక్క చేసి, తూములు పెట్టడం ప్రజలందరికి మేలు చేసింది. తక్కళ్లపెల్లి ఉదకమ్మ చెరువుకు కూడ తూము పెట్టి, నింపుతుండ్రు. మా చెరువు నిండితే మా ఊరిలో రెండు పంటలకు ఢోకా లేదు. చెరువు నింపితే చుట్టుపక్కల బావుల్లోకి సైతం నీళ్లు వచ్చినయి. ఇప్పుడు చెరువు కింద వ్యవసాయం చేస్తున్నం.. బావుల కింద వ్యవసాయం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ చేసిన రుణం ఎప్పటికి తీర్చుకోలేం.
-జల్ల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు, తక్కళ్లపల్లి, కథలాపూర్