Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల జీవనాధారం కోసం మూడేళ్ల కింద విడుదల చేసిన జీ.వో.నెం 4ను మరో రెండేళ్ళపాటు అమలు చేయాలంటూ శుక్రవారం నగరంలో మహార్యాలీ నిర్వహించారు.
స్థానిక మంకమ్మతోట పెట్రోల్ పంపు నుంచి మొదలైన ఈర్యాలీ నాకా చౌరస్థా, తెలంగాణ చౌక్, ప్రతిమ మల్టిప్లెక్స్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది వందలాది మంది గ్రానైట్ క్వారీల యజమానులు, వేలాది మంది కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆసంఘం జిల్లా అధ్యక్షుడు ఐ. విజయభాస్కర్ మాట్లాడుతూ, ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం ప్రతి క్యూబిక్ మీటర్కు రూ.1,435 ప్రస్తుతం చెల్లిస్తున్న టాక్సికి అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
మూడేళ్ళ క్రితమే రాయల్టీ పెంచగా, కరోనా అనంతరం ఎదురవుతున్న సమస్యలతో గ్రానైట్ పరిశ్రమ అచేతన స్థితికి చేరుకుందన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20శాతం టాక్స్ పెంచటంతో తమ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ చెల్లింపుతో పాటు గ్రానైట్ రవాణా చార్జీలు మొత్తం కలిపి అమ్మకం ధరలో 65శాతానికి పైగా ఖర్చవుతున్నట్లు ఆయన వాపోయారు. ప్రభుత్వం అందించే రాయితీలు కుదిస్తూ, పన్నులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుండటంతో లాభాలు దేవుడెరుగు నష్టాలు మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఎదురవుతున్న నష్టాలు భరించలేక వందల సంఖ్యలో క్వారీలు మూతపడ్డాయన్నారు. ఇదే సమయంలో గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్తోతో పాటు కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో సైతం గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రస్తుతమున్న పన్నులు తగ్గించి, 10శాతం మాత్రమే వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణకు చెందిన బయ్యర్లు, కార్మికులు ఆయా రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని అన్నారు.
జిల్లాలో 950కి పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో 60 నుంచి 70 మాత్రమే పనిచేస్తుండగా, ప్రభుత్వం ఈనెల 8న విడుదల చేసిన జీవోలతో ఇవి కూడా మూతపడే స్థితికి చేరుతున్నాయన్నారు. చతికిలపడుతున్న గ్రానైట్ పరిశ్రను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనేక ఆటుపోట్ల నడుమ కొనసాగుతున్న ఈ పరిశ్రమ కోలుకోవాలంటే వెంటనే రాయల్టీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న సీనరేజీ ఫీజులో 40శాతం తగ్గించాలని, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్ కంట్రిబ్యూషన్ ను 20శాతం నుంచి 10శాతానికి తగ్గించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా 30 వేలకు పైగా కార్మికుల కుటుంబాలను పోషిస్తున్న ఈ పరిశ్రమను ఆదుకోకపోతే, ప్రభుత్వాదాయం తగ్గటంతో పాటు కార్మికుల కుటుంబాలు అంధకారంలో పడుతాయని ఆయన తేల్చిచెప్పారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీ సుధాకర్, తిరుపతిగౌడ్, వంశీకృష్ణతో పాటు నాయకులు సతీష్ రెడ్డి, కృష్ణ కాల్వ, జిత్తువ్యాస్, సురేష్ రెడ్డి, మల్లారెడ్డి, కన్నూరి సురేశ్ తో పాటు వంద మందికి పైగా గ్రానైట్ క్వారీల ఓనర్లు, 3వేల మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు.