సిరిసిల్ల/ వేములవాడ/ఎల్లారెడ్డిపేట, నవంబర్ 6 : సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతమయ్యాయి. వేలాది మంది యువతీయువకుల్లో జోష్ నింపాయి. ఉదయం 11.45 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 3.30 గంటలకు ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వేములవాడ సభకు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి, ఎల్లారెడ్డిపేట సభకు సిరిసిల్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.
దారిపొడవునా గులాబీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు తీశారు. ఆయాచోట్ల అమాత్యుడు వేదికలపైకి చేరుకోగానే ‘జై కేటీఆర్’ ‘జైజై రామన్న’ అంటూ నినదిస్తూ కేరింతలుకొట్టారు. అనంతరం రామన్న తన ప్రసంగంతో జోష్నింపారు. ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గతంలో తెలంగాణ ఎట్ల ఉండేది? ఇప్పుడెట్ల మారింది? గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ చైతన్యం నింపారు. ఉద్యమ కాలంలో జరిగిన పరిణామాలను వివరించగా, యువకులందరూ ఆసక్తిగా విన్నారు. సిరిసిల్లలో తనకేం ఫికరు లేదని అనడంతో అందరూ ‘జై కేటీఆర్’ అంటూ నినదించారు. ‘నేను ఎంతో మీకు తెలుసు. మీరేంటో నాకు తెలుసు. మీరు ఇచ్చిన అవకాశంతో మీరు తలెత్తుకొని బతికేలా చేశా.
గర్వంగా ఉంది. నేను ఎక్కడికెళ్లినా సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పకుంటా’ అని అనడంతో విజిల్స్ వేశారు. ఈ నెల 30వ తేదీన మీరంతా నాకు ఓటు వేయడంతోపాటు ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించాలని పిలుపు నివ్వడంతో అందరూ సరేనంటూ మద్దతు నిచ్చారు. ‘కాంగ్రెస్ పరిపాలన అంతా ఎక్కడ ఉంది’ అంటూ మంత్రి ప్రశ్నించడంతో అందరూ ముక్తకంఠంతో ఢిల్లీ అంటూ సమాధానమిచ్చారు. ‘ఆ స న్నాసుల పాలన మళ్లీ రావాలా..?’ అని ప్రశ్నించగా, ‘వద్దే వద్దు’ అంటూ ముక్తకంఠంతో చెప్పారు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ర్టానికే వచ్చి.. కర్ణాటకలో ఐదు గంటలు కరంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్న మాటలను వేదికపై గుర్తు చేయగా, యువకులు నవ్వుకున్నారు. తెలంగాణలో యువతతో మమేకమవుతామ ని, పరిశ్రమలు స్థాపిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో స్వాగతించారు. యువకులకు ఇక్కడ నైపుణ్యశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
ఒక్క కేసీఆర్ను తట్టుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసికట్టుగా వస్తున్నారని, సింహం సింగిల్గానే వస్తుందని చెప్పడంతో ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. గుంపులు గుంపులుగావచ్చేటివి ఏమిటని మంత్రి చలోక్తి విసరగా, యువకులు అంతా కలిసి కట్టుగా పందులు అని రెట్టించిన ఉత్సాహంతో సమాధానమిచ్చారు. ‘నేను అయితే అనలేదు.. మీరే అన్నారు’ అంటూ యువకులను నవ్వించారు. విరాట్ కోహ్లీ ప్రపంచ కప్లో ఆదివారం సెంచరీ చేశాడని, రాను న్న ఎన్నికల్లో కేసీఆర్ సెంచరీ సాధించడం ఖాయమని చెప్పడంతో ఒక్కసారిగా చేతులు పైకెత్తి జైకొట్టారు. ఈ ఎన్నికల్లో గెలిపించేది మీరేనని, మీరే తన బలం, బలగమని తన ప్రసంగాన్ని ముగించారు.
రాజన్నపేటకు చెందిన చెక్కపల్లి మహేశ్ తయారు చేసి అందించిన బాణాన్ని వేదికపై మంత్రి సంధించగా యువకులు కేరింతలు కొట్టారు. వేములవాడలోనూ మంత్రి కేటీఆర్ ఆద్యంతం తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఉద్యమ కాలంలో నెహ్రూ తెలంగాణకు ఆంధ్రాకు ఇష్టం లేని పెళ్లి చేశారని అనడంతో సభలో అంతా నవ్వుకున్నారు. మన బతుకులు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మనమడే రాహుల్ గాంధీ అని అనడంతో ‘అవును అవును’ అంటూ యువకులు అన్నారు. ఢిల్లీ బాస్లు కాదు గల్లీబాసులు కావాలని ప్రజలు కోరుతున్నారని అనడంతో జైకొట్టారు. వేములవాడ అభ్యర్థి, చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని ప్రకటించడంతో అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. వేములవాడలో లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరడంతో అందరూ గెలిపిస్తామని అన్నారు. ఆయాచోట్ల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రామన్నను కలిసేందుకు యువకులు పోటీపడ్డారు.
ఎల్లారెడ్డిపేటలో అమాత్యుడు రామన్న డ్యాన్స్ చేసిన యువతను ఉర్రూతలూగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు.. ‘జై తెలంగాణ’ అని పలుకరిస్తూనే.. ‘ఏమైంది అంతా డల్గా ఉన్నరు. దేఖ్లేంగే పాట చూశారా.. మరోసారి వేయమంటారా..’ అని అడిగారు. ఆ వెంటే పాట వేయాలని యువకులు కోరడంతో వేదిక వెనుక పై ఉన్న స్క్రీన్ పై ‘గిరగిరగిర గింగిర గిర ఔర్ ఏక్ దక్కా. గిరగిరగిర గింగిరగిర కేసీఆర్ పక్కా’ అనే పాటను వేశారు. అప్పుడు వేదిక కింద యువకులంతా గులాబీ కండువాలు ఊపుతూ నృత్యం చేశారు. పాట పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దేఖ్లేంగే అంటే చూసుకుందాం అనే అర్థమని, నవంబర్ 30 నాడు కాంగ్రెస్, బీజేపీ వాళ్లను అరుసుకుందామా.. అంటూ కారు గుర్తుకే మన ఓటు అని నినదించారు. వేదికపై ఉన్న యువనాయకులు హుషార్ లేరంటూ మంత్రి కేటీఆర్ అంటుండగానే.. యువ నాయకులు ‘వన్స్మోర్’ అంటూ మంత్రిని కోరారు. మరోసారి రిపీట్ చేయించడంతో వేదికపై ఉన్న యువ నాయకులు గులాబీ కండువాలను ఊపుతూ డ్యాన్స్ చేస్తుండగా, మంత్రి కేటీఆర్ కూడా తన మెడలో ఉన్న గులాబీ కండువాను పైకి ఎత్తి ఉపూతూ వారితో జతకలిశారు. దీంతో ఒక్కసారి సభా ప్రాంగణం అంతా ఈలలు, కేరింతలు మార్మోగింది.
ముస్తాబాద్కు చెందిన రాష్ట్ర కేటీఆర్ సేన అధ్యక్షుడు మెంగని మనోహర్ కొడుకు తారకరామ్ మంత్రి కేటీఆర్పై అభిమానం చాటుకున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు, కేటీఆర్ నామినేషన్ కోసం కిడ్డీ బ్యాంక్లో దాచుకున్నాడు. అలా 10 వేలు జమచేశాడు. వాటిని ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం వేదికపై అందజేశాడు. ‘మీ పేరే.. నా పేరు’ అని ఆ బాలుడు చెప్పడంతో మంత్రి కేటీఆర్ మురిసిపోయారు. కిడ్డీబ్యాంక్ బాక్స్పై కారు గుర్తుకు ఓటేద్దాం.. కేసీఆర్ను గెలిపిద్దామనే నినాదాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు మంత్రి కేటీఆర్ చూపించారు. ఈ సందర్భంలోనే తారకరామ్ ఒక పాట పాడాడు. ‘అయ్యసార్ కేసీఆర్ సల్లంగుండాలి. కారు గుర్తుకు ఓటేయాలి. కేసీఆర్ సార్ను గెలిపించుకోవాలి’ అని పాడి ఆకట్టుకున్నాడు. దీంతో వేదికపై ఉన్నవారంతా చప్పట్లతో తారకరామ్ను అభినందించారు.
ఎల్లారెడ్డిపేట సభలో మంత్రి కేటీఆర్ యువతను ఆలోచింపజేసేలా ఒక పిట్ట కథను చెప్పారు. ‘రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చిన భార్యాభర్తలు సాయంత్రం బువ్వ తింటుండగా చెత్తు(స్లాబ్) మీద నుంచి ఒక తేలు కింద పడింది. అది చూసి భార్య కేకలు వేసింది. ఆ తేలును సంపుమని భర్తను కోరడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిండు. ఎందుకు బయటకు వెళ్తున్నావని భార్య ప్రశ్నించగా, తేలును సంపడానికి బయట ఎవరైనా మగవాళ్లు ఉంటే పిలుచుస్తానని చెప్పిండంట’ అంటూ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పార్టీలకు బానిసత్వం చేయాల్సిన పరిస్థితి వద్దని పరోక్షంగా ఉదహరించడంతో యువకులు కథను ఆసక్తిగా విని నవ్వుకున్నారు.