Grand Graduation Celebrations | కోల్ సిటీ, ఏప్రిల్ 27 : గోదావరిఖని పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈసీసీఈ వార్షికోత్సవంలో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. సీడీపీఓ అలేఖ్య ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్ల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యత అని వివరించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు గ్రేడ్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ సెంటర్లలో ప్లే స్కూల్ విద్యను మరింత బలోపేతం చేయాలని టీచర్లకు సూచించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్లే స్కూల్ కోసం అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని కోరారు. అనంతరం సిడిపిఓ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో 11,42,43,54 డివిజన్ల కార్పొరేటర్లు కారంగుల రమ్య, దొంత శ్రీనివాస్, పాత పెళ్లి కావ్య, ఎండి ముస్తఫా, అంగన్వాడి టీచర్లు అనిత, శ్రీ మాల, నిర్మల, భాగ్య, సుజాత తో పాటు హెల్పర్లు రమాదేవి, స్వరూప, తిరుమల, రజిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.