గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్రమంతో పట్టణాలకు దీటుగా ప్రగతి సాధించాయి. ఉమ్మడి జిల్లాలోని అనేక జీపీలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. గురువారంతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, సర్పంచులంతా ఉద్వేగానికి లోనవుతున్నారు. కేసీఆర్ సర్కారు పాలనలో పనిచేయడం, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం తమ అదృష్టమని భావిస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. నిధులు లేక ఏ మాత్రం పగ్రతి కనిపించేంది కాదు.. అధ్వానంగా మురుగు కాలువలు, చెత్తా చెదారంతో కంపుకొట్టే వీధులు, గుంతలమయంగా రోడ్లు, తాగునీటికి ఇబ్బందులు.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి పల్లె నిండా సమస్యలే దర్శనమిచ్చేవి. కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలు చేయడంతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి.
గడిచిన ఐదేళ్లలో దేశాని కే ఆదర్శంగా నిలిచాయి. పల్లె ప్రగతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానంలో అమలు చేసింది. అందులో విధిగా ప్రజలకు భాగస్వామ్యం కల్పించింది. పారిశుధ్య నిర్వహణను ప్రతి పంచాయతీ సమర్ధవంతంగా నిర్వహించేలా ప్రోత్సహించిం ది. 200 జనాభా ఉన్న చిన్న పంచాయతీ నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీకి ట్రాక్టర్లు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనికి అనుబంధంగా ప్రతి గ్రామం లో డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్డులు ఏర్పాటు చేసింది. తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు ఇంటింటికీ బుట్టలు పంపిణీ చేసింది.
సామాజిక సేవలకు నిదర్శనంగా ప్రతి పల్లెలో వైకుంఠధామాలు నిర్మించింది. పచ్చదనం పరిఢవిల్లేలా ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి ఏటా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి చిన్న పల్లెలోనూ ఎల్ఈడీ లైట్లు పెట్టించింది. ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒకటి చొప్పున రైతు వేదికలను, సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. శిథిలమైన భవనాలను తొలగించింది. సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి ఆదర్శ పాలనను అందించింది. ఒకప్పుడు తాగునీటి కోసం అల్లాడిన పల్లెలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీటిని అందించింది.
ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీలు విస్తరణకు నోచుకోలేదు. అనేక చోట్ల డిమాండ్లు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వా ల చెవికెక్కలేదు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడే ప్రతి 500 జనాభా ఉన్న శివారు పల్లెలు, తండాలను పంచాయతీలుగా గుర్తించే కార్యక్రమం చేపట్టిం ది. 2016లో చిన్న జిల్లాల ఏర్పాటు వరకు కరీంనగర్ ఉమ్మ డి జిల్లాలో 1,207 పంచాయతీలు ఉండేవి. అనుబంధ గ్రా మాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. ప్రతి పనికి పంచాయతీకి వచ్చేందుకు అనుబంధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. దీంతో పంచాయతీలకు దూరంగా ఉన్న ప్రతి గ్రామా న్ని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించింది. దీంతో శివారు గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
అయితే, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 185 పంచాయతీలు ఇతర జిల్లా ల్లో కలిశాయి. ఆమేరకు కొత్త నాలుగు జిల్లాల్లో కలిపి 1022 పంచాయతీలు మిగిలాయి. అయితే, ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను పెంచడం, కొన్ని పంచాయతీలను పురపాలక సంఘాల్లో విలీనం చేయగా, కొత్తగా ఏర్పడిన పంచాయతీలు కలిపి నాలుగు జిల్లాల పరిధిలో జీపీల సంఖ్య 1228కు చేరింది. ప్రతి పంచాయతీకి 13 లక్షలు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించింది. అంతే కాకుండా పాత పంచాయతీలకు ఉమ్మడి జిల్లాలో 98 కొత్త భవనాలు నిర్మించింది.
కేసీఆర్ సర్కారు పాలనలో అనేక గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించిన ప్రతీ సారి ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలే ఎక్కువగా కైవసం చేసుకున్నాయి. 2015-16లో ఈ అవార్డులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 జీపీ లు జాతీయ స్థాయి అవార్డులు పొందాయి. ఇందులో పెద్దపల్లికి 6, సిరిసిల్లకు 6, కరీంనగర్కు 3, జగిత్యాలకు మరో 3 అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లానే అత్యధికంగా జాతీయ అవార్డులు సాధించినది గుర్తింపు పొందింది.
పంచాయతీలకు ప్రాతినిధ్యం వహించిన సర్పంచుల పదవీకాలం గురువారం వరకు ముగిసింది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతున్నది. 2019 ఫిబ్రవరి 2న సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టారు. చివరి రోజైన గురువారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎంతో సంతృప్తిగా తమ పదవీ కాలాన్ని ముగించారు. రెండు మూడు రోజుల నుంచి ఆయా గ్రామాల్లో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండగా, సర్పంచులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కేసీఆర్ సర్కారు పాలనలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు సేవలు అందించే సువర్ణ అవకాశం తమకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల పాలన తమ జీవితంలో మరిచిపోలేనిదని సంతోషంగా చెబుతున్నారు.
ఐదేళ్లపాటు పర్లపల్లికి సర్పంచిగా పనిచేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. గ్రామాన్ని మా హయాంలో అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. కేసీఆర్ సర్కారు అందించిన ప్రోత్సాహంతో గ్రామంలో అద్భుతంగా వసతులు కల్పించగలిగాం. దీంతో మా పర్లపల్లికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. దీనికి కృషి చేసిన అధికారులు, వార్డు సభ్యులు, ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ. భవిష్యత్తులో సర్పంచిగా ఎవరున్నా బాగా పనిచేయాలి. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుంది.
– మాదాడి భారతీదేవి, పర్లపల్లి సర్పంచ్ (తిమ్మాపూర్)
హరిదాస్నగర్ గ్రామానికి సర్పంచ్గా పనిచేసి, ప్రజలకు సేవలందించడం నా అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ సర్కారులో మంత్రి కేటీఆర్ చొరవతో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా పారిశుధ్యం మెరుగుపడింది. గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఇవ్వడం వల్ల ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించాం. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యమయ్యారు. డంప్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. పచ్చదనం పెరిగింది. ప్రజలు, అధికారులు, మంత్రి కేటీఆర్ సహకారంతో అద్భుతమైన పల్లెగా తీర్చిదిద్దిన సంతోషం కలిగింది. ఐదేళ్ల పాలన సంతృప్తినిచ్చింది. సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు.
– తెడ్డు అమృత, మాజీ సర్పంచ్, హరిదాస్నగర్ (ఎల్లారెడ్డిపేట మండలం)