గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానున్నది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాని కారణంగా ప్రభుత్వం స్పెషలాఫీర్ల పాలన తెస్తున్నది. ఓవైపు సర్పంచులు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని విన్నవిస్తున్నా స్పందించలేదు. ప్రత్యేకాధికారుల పాలన కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 21 క్యాడర్లలో అధికారుల వివరాలను సేకరించిన ఎంపీడీవోలు కలెక్టర్కు ప్రతిపాదన పంపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడో రేపో ప్రత్యేక జాబితాను విడుదల చేయనున్నారు.
కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యపడని కారణంగా ప్రభుత్వం స్పెషలాఫీర్లను నియమిస్తున్నది. 2018లోనూ ఇదే విధంగా నియమించింది. ఆ ఏడాది ఆగస్టు 2 నుంచి 2019 ఫిబ్రవరి 2 వరకు అంటే.. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసే వరకు సుమారు 6 నెలలపాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అప్పట్లో అంటే.. 2019 జనవరి 21న మొదటి, 25న రెండో, 30న మూడో విడుతలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగింది. దీంతో సర్పంచుల పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 1న ముగుస్తుంది.
దీంతో ప్రభుత్వం 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన తేబోతున్నది. అందుకు జిల్లాల వారీగా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. సర్పంచుల కాల పరిమితి తీరిన వెంటనే ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పదవీ కాలాన్ని జూన్ వరకు పొడిగించాలని, తనకే పూర్తి అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఫిబ్రవరి రెండులోగా పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకాధికారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీవోలు సిద్ధం చేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. మొత్తం 21 కేటగిరీల్లోని అధికారులను పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా ఎంపిక చేశారు. మండల స్థాయిలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారుల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల పరిషత్తు సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పశువైద్యాధికారులు, పంచాయతీరాజ్ ఏఈలు, మిషన్ భగీరథ ఏఈలు, ఎంఈవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, అవసరమైన చోట వాడుకునేందుకు గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, టైపిస్టులు, తదితర కేటగిరీల్లోని ఉద్యోగులను కూడా తీసుకుంటున్నారు.
మండలాల వారీగా ఎంపీడీవోల నుంచి జాబితా రాగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఎక్కువ గ్రామాలున్న గంగాధర, మానకొండూర్ మండలాలకు కింది స్థాయి ఉద్యోగులను కూడా ఎంపిక చేసినట్టు కరీంనగర్ జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి పవన్కుమార్ తెలిపారు. అయితే ప్రత్యేకాధికారుల జాబితా నేడో రేపో అధికారికంగా వెలువడే అవకాశాలు ఉండగా.. ఏ గ్రామానికి ఏ అధికారిని నియమిస్తున్నారనే చర్చ అన్ని గ్రామాల్లో నడుస్తున్నది. ఇప్పటికే గ్రామాల వారీగా కొంత మంది ప్రత్యేకాధికారుల పేర్లు వినిపిస్తుండగా, అంతటా ఆసక్తి కర చర్చ సాగుతున్నది.