కోరుట్ల, డిసెంబర్ 17: తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన విశ్రాంత ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, వాసవీ కల్యాణ భవనంలో శనివారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెన్షనర్ల కోసం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఎస్టీవో కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వార్టర్ సమీపంలోకి మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పలువురు విశ్రాంత ఉద్యోగులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. తన తల్లిదండ్రులు సత్యమ్మ పాపారావు సంస్మరణార్థం పింఛన్దారులకు ఎమ్మెల్యే అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ఎస్టీవో లావణ్య, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భూమానందం, ప్రకాశ్, మేడి కిషన్, కాంతారావు, ఆంజనేయులు, రవిశంకర్, మురళి, నర్సయ్య, సుధాకర్, హఫీజ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.