ఓదెల, ఆగస్టు 23: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, ఈ నెల 24న ఉదయం 8 గంటలకు ఆలయ పునర్నిర్మాణ పనులను వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు.
శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. విరాళాల రూపంలో జమ చేసిన రూ. 9.60 లక్షలు ప్రభుత్వానికి కంట్రిబ్యూషన్ కింద కట్టారు. తాజాగా, కాకతీయుల కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఈ దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకోవడం శుభ పరిణామమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.