వేములవాడ, జనవరి 25: అరుదైనఆపరేషన్లకు వేములవాడ ఏరియా దవాఖాన కేంద్రంగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహం, కల్పించిన వసతులతో మోకాలు కీలు మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ రోగులకు సాంత్వన కలిగిస్తున్నది. తాజాగా నలుగురికి ఆపరేషన్లు చేసిన వైద్య బృందం, బుధవారం వారిని నడిపించి శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ప్రకటించింది.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సేవలను అందిస్తూ, లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లను పైసా ఖర్చు లేకుండా చేయిస్తున్నది. అందుకు వేములవాడలోని ఏరియా దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. ఆధునిక హంగులు, సకల వసతులతో తీర్చిదిద్దిన ఈ వైద్యశాలలో ఇప్పటి వరకు ఐదు మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వైద్య బృందం, తాజాగా మరో నలుగురికి ఒకే రోజు విజయవంతంగా ఆపరేషన్లు చేసింది. లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లను పూర్తి ఉచితంగా చేయడంతో బాధితులకు సాంత్వన కలుగుతున్నది.
వేములవాడ ప్రభుత్వ దవాఖానలో ప్రభుత్వం ఆ ధునిక వైద్యసదుపాయాలను కల్పించింది. నాలుగున్నర ఎకరాల్లో 79వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో వంద పడకల సామర్థ్యం తో భవనాన్ని నిర్మించింది. ఇప్పటికే ఇందులో దాదాపు రూ.2కోట్లతో సిటీ స్కాన్, ఆక్సిజన్ జనరేటర్ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక వార్డు, మాతా శిశు సంరక్షణలో భాగంగా ప్రత్యేక వార్డు, ఇతర అనేక వైద్య సదుపాయాలు కల్పించడం, నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందిస్తుండడంతో ఆదరణ పెరిగింది. దవాఖానకు నిత్యం దాదాపు 300 మంది ఓపీకి వస్తున్నారు. ప్రైవేట్కు మించి ప్రసవాలు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా 450 మందికి ఆపరేషన్లు చేశారు.
విజయవంతంగా మోకీలు మార్పిడి..
వేములవాడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్రావు బృందం అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్నది. అత్యంత ఖరీదైన వైద్యం, కేవలం హైదరాబాద్లాంటి మహానగరాలకే పరిమితమైన మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతం చేస్తున్నది. ఇప్పటివరకు ఐదుగురికి ఆపరేషన్లు చేసింది. తాజాగా మరో నలుగురికి ఒకే రోజు నిర్వహించినట్లు వైద్య బృందం పేర్కొం ది. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని జగిత్యా ల జిల్లాకు చెందిన కథలాపూర్ మండలం రా జారాం తండా ఉపసర్పంచ్ ఇస్లావత్ చంద్రు, బొ మ్మెనకు చెందిన చిన్న నర్సయ్య, మెట్పల్లి మం డలం మాసాయిపేటకు చెందిన కట్టె పెద్ద లక్ష్మి, వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్కు చెందిన చిందం వీరవ్వ కొన్నేండ్లుగా మోకాలి నొ ప్పులతో బాధపడుతూ వైద్యులను సంప్రదించారు. కీలు మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడడంతో వెంటనే వైద్యులు ఈ నలుగురికి శస్త్రచికిత్స చేశారు. బుధవారం వారిని నడిపించి ఆపరేషన్లు విజయవంతమైనట్లుగా ప్రకటించారు. కా గా, అత్యంత ఖరీదైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ స హకారంతో వేములవాడ దవాఖానలో నిర్వహించామని వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో వైద్యులు అనిల్ కుమార్, తిరుపతి, శశి, సంతోష్చారి, వెంకట్ బృందం బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే తొమ్మిది మందికి చేశాం..
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు శస్త్రచికిత్స సేవలు పూర్తి ఉచితంగా అందిస్తుంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా వేములవాడ ఏరియా దవాఖానలో కీలుమార్పిడిని గతేడాది మేలో విజయవంతంగా చేశాం. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి సహకారంతో వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు తొమ్మిది మందికి కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం చేశాం.
– డాక్టర్ రేగులపాటి మహేశ్రావు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్
బయటైతే రెండు లక్షలు అయ్యేటియి
ఎనిమిదేండ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న. ఏం పనిచేసుడు వీలుగాక ఇంట్లోనే ఉంటు న్న. చానా ఇబ్బందైతంది. వేములవాడ దవాఖాన్లకు వచ్చి చూపించుకున్న. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నరు. మొదట భయపడ్డ. కానీ, ఏం కాదని ధైర్యం చెప్పిన్రు. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసి మరునాడే నడిపించిన్రు. ఇదే ఆపరేషన్ బయటి దవాఖాన్ల అయితే రెండు లక్షలయితయని చాలా మంది అన్నరు. ఇంత గొప్ప మేలు చేసిన కేసీఆర్కు మేం రుణపడి ఉంటం.
– చిందం వీరవ్వ, ఫాజుల్ నగర్ (వేములవాడ రూరల్ మండలం)
బయటైతే లక్షల రూపాయలు అయితుండె
ఏడాదిన్నరగా మోకాలు నొప్పితో బాధపడుతున్న. ఎన్నో దవాఖానలు తిరిగిన. ఆపరేషన్ చేయించుకోవాలని అన్నరు. కానీ అది అట్టిగైతదా..? లక్షలు.. లక్షలు కావాల్నాయె. మా దగ్గర అన్ని పైసలు లేకపాయె. అందుకే ఏదైతే అదైందని చాలించుకున్న. కానీ, వేములవాడ దవాఖాన్ల ఫిరీగ చేస్తున్నరని తెలిసి ఇక్కడికి వచ్చిన. డాక్టర్లకు చూపించుకున్నాక టైం ఇచ్చి మొన్న ఆపరేషన్ చేసిన్రు. బయటైతే లక్షల రూపాయలు అయితుండె. కానీ, ఇక్కడ ఉచితంగా చేసిన్రు. ఇదంతా కేసీఆర్ సారు దయే. ఆ సారుకు రుణపడి ఉంట. ఆపరేషన్ మంచిగ చేసిన డాక్టర్లకు దండం పెడుతున్న.
– కట్టె పెద్ద లక్ష్మి, మూసాయిపేట (మెట్పల్లి మండలం)