సర్కారు దవాఖాన కార్పొరేట్ను తలదన్నుతున్నది. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే నానుడిని చెరిపేస్తూ, స్వరాష్ట్రంలో తీసుకున్న చర్యలతో ‘పదా పోదాం బిడ్డ.. సర్కారు దవాఖానకు..!’ అనేంతగా నమ్మకం పెరిగింది. నాడు అధ్వానంగా మారిన దవాఖానలను బలోపేతం చేయడం, అత్యాధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి, అపార అనుభవం ఉన్న వైద్య నిపుణులను నియమించడంతో కీలక సేవలన్నీ చేరువయ్యాయి.
ప్రైవేట్లో లక్షలు పెట్టి చేసే మోకీలు, తుంటి మార్పిడి, శస్త్రచికిత్సలు పూర్తి ఉచితంగా అందుతున్నాయి. ఆనో రెక్టల్ ఫార్మేషన్, డిక్టారేషన్ లాంటి అత్యంత అరుదైన సర్జరీలు, ముక్కు, చెవి, గొంతు విభాగం, గైనకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, జనరల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జరీ, ట్రూమాకేర్ విభాగాల్లో అత్యాధునిక శస్త్రచికిత్సలు ఫ్రీగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల ప్రధాన దవాఖానల్లో ఒక్కో నెలలో 50 నుంచి 60 ఆపరేషన్లు చేస్తుండగా, పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ):ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. రోగాల బారిన పడి వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ప్రభుత్వం పేదల కోసం సర్కారు దవాఖానలను అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయంగా మార్చింది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే జంకే జనం ఇప్పుడు ఇక్కడే శస్త్ర చికిత్సలు చేయించుకుంటామనే పరిస్థితికి వచ్చారు.
పేదల మన్ననలు పొందుతున్న ప్రభుత్వ వైద్యు లు ఇప్పుడు ప్రతి దవాఖానలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ అరుదైన సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో ముక్కు, చెవి, గొంతు విభాగం, గైనకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, జనరల్ సర్జ న్, ప్లాస్టిక్ సర్జరీ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమిం చి ఈ శస్త్ర చికిత్సలను పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్సలు పెరిగాయి. అంతే కాకుండా.. తుంటి, మోకాలు మార్పిడి వంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రభుత్వ దవాఖానలు పేదలకు వరంగా మారాయి.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం అరుదైన ఆపరేషన్లకు నిలయంగా మార్చింది. ముఖ్యంగా తుంటి, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇక్కడ విరివిగా చేస్తున్నారు. కరీంనగర్లోని టవర్సర్కిల్కు చెందిన కామారపు శివకుమార్ అనే వ్యక్తికి రెండు కాళ్లకు ఉన్న టోటల్ హిప్స్ రీప్లేస్మెంట్ (టీహెచ్ఆర్) ఆపరేషన్ చేసిన స్థానిక వైద్యులు రికార్డు సృష్టించారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్ దవాఖానలో చేయించుకుందామని చూసిన శివకుమార్కు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని సదరు వైద్యులు చెప్పడం, తిందామంటే తిండికి లేని శివకుమార్ ఇంత మొత్తం వెచ్చించి తన ఆరోగ్యం బాగు చేయించుకోలేనని భావించి కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు రావడం, ఇతని బాధను గుర్తించిన ఆర్థోపెడిక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ నారగోని కుమార్గౌడ్ ఇతనికి టీహెచ్ఆర్ ఆపరేషన్ చేసి ఆదుకున్నారు. ఇలా అనేక మందికి ఇప్పటికే అరుదైన ఆపరేషన్లు చేసి పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గోవింద్ నవీన్ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానలో చేరగా పరీక్షలు చేసిన వైద్యురాలు డా.కళావతి ఇంటరెయిన్ పర్పోరేషన్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. తీసుకున్న ఆహారం జీర్ణంకాక పసరు రూపంలో కడుపులోకి జారి కడుపు ఉబ్బుతుందని గుర్తించారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వారి కుటుంబీకులకు చెప్పారు.
వారి అంగీకారంతో అదేరోజు డాక్టర్లు ఉదయ్ కుమార్, ప్రకాశ్, అనస్తీషియన్లు భానులక్ష్మి, అజహార్, రాజేశ్వరి, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది మానస, పుష్ప, రవి బృందం నవీన్ కు ఆపరేషన్ చేశారు. రోగి శరీరంలోని ఒమెంటన్ ఆనే పొరను రంధ్రం పడిన పేగు వద్ద అంటించి రంధ్రాన్ని మూసివేశారు. 18 సెం.మీ కోసి 12కుట్లు వేసినట్లు తెలిపారు. ప్రైవేట్ దవాఖానలో రూ. 1.50 లక్షల వరకు ఖర్చయ్యే శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా చేశారు.
ప్రభుత్వ దవాఖానలపై పేదలకు నమ్మకం కుదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రతి దవాఖానలో రూ.కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. 2014కు ముందు ప్రభుత్వ దవాఖానలు అంటేనే జనం హడలి పోయేవారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల తీరే మారిపోయింది. ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు చేసి వైద్య సేవలు పొందలేని పేదలు ప్రభుత్వ వైద్యాన్ని కోరుకుంటున్నారు. అరుదైన చికిత్సలు చేస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలకు రోగుల తాకిడి పెరుగుతున్నది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో గతంలో 300 మాత్రమే ఉన్న ఓపీ ఇప్పుడు వెయ్యికిపైగా పెరగడం ఇందుకు ప్రబల నిదర్శంగా చెప్పవచ్చు.
గతంలో ఇలాంటి శస్త్ర చికత్సల కోసం పేదలు వరంగల్లోని ఎంజీఎంకో, హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ దవాఖానలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడంతో ఇప్పుడు ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలు విరివిగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దవాఖానలో జనరల్ సర్జన్ కింద ప్రతి నెలా 40 నుంచి 50, ఆర్థోపెడిక్ కింద 35 నుంచి 40, ఈఎన్టీ కింద 10 నుంచి 15, కంటి శస్త్ర చికిత్సలైతే 100 నుంచి 120 వరకు జరుగుతున్నాయి. ఒక్కో శస్త్ర చికిత్స విభాగానికి హెచ్వోడీతోపాటు వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని విభాగాల్లో ఉన్న వైద్యుల కొరతను తీర్చింది. అంతే కాకుండా దవాఖానలో ఉన్న ఆరు ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించింది. ఆపరేషన్ల కోసం గతంలో ఒక్క సీయామ్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో సీయామ్స్ను ఏర్పాటు చేసింది. గతంలో చిన్న చిన్న ఆపరేషన్లు మాత్రమే జరిగే ఈ ప్రభుత్వ దవాఖానలో ఇప్పుడు మేజర్, విలువైన ఆపరేషన్లు కూడా చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ఏరియా దవాఖాన పేదలకు అపరసంజీవనిగా మారిపోయింది. ఇక్కడ ముగ్గురు సర్జన్లు, ఇద్దరు అనస్టీషన్లు, నలుగురు జనరల్ ఫిజీషియన్లతో కూడిన వైద్యుల బృందం కొన్నాళ్లుగా అత్యంత అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా చేస్తున్నది. మలద్వారం లేకుండా పుట్టిన ఒక నవజాత శిశువుకు అరుదైన ఆనో రెక్టల్ ఫార్మెషన్ లాంటి అత్యంత కీలకమైన ఆపరేషన్ చేశారు. అలాగే డికార్టెషన్ లాంటి ఆపరేషన్ను సైతం చేశారు. మూడు నెలల శిశువుకు శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలు జరగడం లేదని గుర్తించారు.
చాతి తెరిచి ఊపిరితిత్తుల వ్యాకోచ, సంకోచాలకు అడ్డు పడుతున్న వాటిని తొలగించారు. మరో కేసులో నవజాత శిశువుకు మూత్రనాళం పురీషనాళం దిగువ భాగంలో ఉందని వైద్యులు గుర్తించారు. మెడికల్ పరి భాషలో ఐపాస్ పీడీయాస్ అని పేర్కొనబడే అరుదైన ఈ సమస్యకు సైతం జగిత్యాల వైద్య బృందం ఆపరేషన్ చేసి విజయవంతం చేశారు. ఇలా ప్రతి నెలా సగటున 50కి పైగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఆపెండిసైటిస్, హైడ్రోసిల్, హెర్నియా, అబ్డామిన్ సంబంధిత శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు అసిస్టెంట్ సివిల్ సర్జన్గా కొద్ది నెలల క్రితం పని చేసిన డాక్టర్ గంగాధర్ పిడీయాట్రిక్ సర్జన్ కావడం, ఇటీవలి వరకు ఆర్ఎంగా ఉన్న అనస్తీషియా నిపుణుడు రామకృష్ణ అత్యంత అనుభవజ్ఞుడు కావడంతో జగిత్యాల దవాఖానలో చిన్నపిల్లలకు సంబంధించిన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేపట్టారు.
ఆనో రెక్టల్ ఫార్మెషన్, డికార్టెషన్, ఐపాస్ పిడీయాస్ లాంటి శస్త్ర చికిత్సలు చాలా అరుదైనవని, వీటిని హైదరాబాద్లోని నీలోఫర్, వరంగల్ ఎంజీఎం, కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే ఇలాంటి ఆపరేషన్లు చేస్తారని, అలాంటి ఆపరేషన్లు జగిత్యాలలో చేస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ రాములు తెలిపారు. ఇవి అత్యంత ఖరీదైనవని, ప్రైవేట్లో ఒక్కొక్క ఆపరేషన్కు రూ.3 నుంచి రూ.5లక్షల దాకా వ్యయం అవుతుందని కానీ, తాము ప్రభుత్వ సహాయ సహకారాలు, వసతుల కల్పన వల్ల ఫ్రీగా చేస్తున్నట్లు చెప్పారు. ముక్కు, చెవి, గొంతు విభాగం, గైనకాలజీ, గ్రాస్టో ఎంట్రాలజీ, జనరల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జరీ, ట్రూమాకేర్ విభాగాల్లో గత మూడేండ్ల వ్యవధిలో 1642 ఆపరేషన్లు చేసినట్లు వివరించారు.
కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వెంకట్, రమ్య (పేర్లు మార్చాం) దంపతులు. పేద కుటుంబం. కూలీ పనిచేసుకొని జీవిస్తున్నారు. అయితే రమ్య గర్భవతి కాగా, ఇంటిల్లిపాది సంతోషించారు. అక్కడ పనిచేసే ఆశకార్యకర్త, అంగన్వాడీ టీచర్లు పేరు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం జగిత్యాల దవాఖానకు రమ్య వెంకట్ను పంపించగా, పరీక్షించి అంతా బాగుందని చెప్పారు. ప్రతి నెలా దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతా బాగానే నడిచింది. నెలలు నిండాయి. జగిత్యాల దవాఖానకు వెళ్లగా, రమ్యకు మగబిడ్డ జన్మించాడు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా. పుట్టిన బిడ్డకు మలద్వారం లేదని వైద్యులు ప్రసవం సమయంలోనే గుర్తించారు. విషయాన్ని రమ్య-వెంకట్ దంపతులకు తెలియజేశారు. మగబిడ్డ పుట్టాడని సంబురపడుతున్న ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బిడ్డను కాపాడాలని డాక్టర్లను ప్రాదేయపడగా, వైద్యులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అరుదైన ఆనో రెక్టల్ మాల్ ఫార్మెషన్ అనే అత్యంత కీలకమైన శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిజిషియన్, అనస్తీషియన్స్, ఇద్దరు సర్జన్స్తో కూడిన బృందం శ్రమించి ఆహార విసర్జన పేగును కడుపులో నుంచి బయటకు తీసి పెట్టారు. ఆరు నెలల పాటు శిశువు మల విసర్జన ప్రక్రియను అలాగే కొనసాగింపజేశారు. తర్వాత శిశువుకు మరో ఆపరేషన్ చేశారు.
శిశువుకు మలద్వారాన్ని ఏర్పాటు చేసి బయట ఉంచిన మల విసర్జన పేగును కడుపులో పెట్టి మలద్వారంతో అనుసంధానం చేశారు. ఆపరేషన్ను విజయవంతం కావడంతో శిశువుకు కొత్త జన్మ లభించింది. ఇది చూసిన శిశువు తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము, తమ బిడ్డ బతికినంతకాలం డాక్టర్ల చేసిన సేవను మరిచిపోమని చెప్పారు. ఇలా ఈ ఒక్క చికిత్సనే ఎన్నో రకాల అరుదైన ఆపరేషన్లను జగిత్యాల వైద్యులు విజయవంతంగా చేశారు.