శంకరపట్నం, ఫిబ్రవరి 3 : ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోందని హార్టికల్చర్ అధికారి మంజువాణి తెలిపారు. శుక్రవారం అర్కండ్ల గ్రామంలో చింతిరెడ్డి మధూకర్రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు చేసి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ పంట సాగుతో 4-30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఏవో శ్రీనివాస్, ఏఈవో లక్ష్మీప్రసూన, గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ కోటయ్య, రైతులు మోతె ఎల్లారెడ్డి, వంగల గాల్రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడులు
రైతులు ఆయిల్ పామ్ పంటలు సాగుచేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ విస్తరణ అధికారి సీహెచ్ రాకేశ్ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రైతు మాడ ఉమా-సమ్మిరెడ్డి 3 ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేస్తుండగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఈఓ రాకేశ్ మాట్లాడుతూ, ఒక ఎకరానికి 57 మొక్కలు నాటాలని, 4 సంవత్సరాల తరువాత దిగుబడి రావడం జరుగుతుందని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్పై ప్రభుత్వం రాయితీ ఇస్తుందని , రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాడ విజయేందర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సీహెచ్.శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అడిగొప్పుల సత్యనారాయణ, రైతులు శివారెడ్డి, పాపిరెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సాగుకు రైతులు ముందుకు రావాలి
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ దొడ్డె మమత కోరారు. శుక్రవారం మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో మండ వెంకటరాజ్యం 6 ఎకరాల 24 గుంటల వ్యవసాయ క్షేత్రంలో 370 ఆయిల్ పామ్ మొక్కలను సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ రామరాజు, జగ్గయ్యపల్లి సర్పంచ్ కనపర్తి వంశీధర్రావు, జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్, ఎంపీటీసీ పొల్సాని రాజేశ్వర్రావుతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు కోసం 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ను అందజేస్తుందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను సాగు చేసుకోవడంతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ ఏఈవో లక్ష్మణ్, హార్టికల్చర్ ఆఫీసర్ ఐలయ్య, ఫీల్డ్ ఆఫీసర్ వేణు, రైతులు తదితరులు ఉన్నారు.