సాగును బంగారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు అన్నదాత ఇంట్లో సంతోషాన్ని నింపుతున్నది. ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గత నెల 28 నుంచి పదో విడుత పెట్టుబడి ఖాతాల్లోకి చేరుతుండగా, సహాయం అందుకుంటున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని, తమకు కనిపించే దైవమని కొనియాడుతున్నది. నగదును విడిపించుకుంటూ సాగుకు సంబురంగా కదులుతున్నది.
– పెద్దపల్లి, జనవరి 7(నమస్తే తెలంగాణ)
రైతుబంధు వల్లే దుబాయి నుంచి తిరిగి వచ్చిన
మాది ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట. ఒకప్పుడు నాకు ఊళ్లె నాలుగెకరాల భూమి ఉండేది. ఎస్సారెస్పీకి ఎగువన ఉండడంతో మా ఊరి చెరువులో నీళ్లుండకపోయేది. రానురాను ఎవుసం పూర్తిగా దెబ్బతిన్నది. మెల్లగా మా కుటుంబానికి కష్టాలు మొదలైనయి. 22 ఏండ్ల వయసులో సత్తెమ్మతో నాకు పెండ్లయింది. వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించ లేదు.
బోరువేసినా నీళ్లు పడలే. ఎటు చూసినా కష్టాలు కనిపించినయి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం 2002లో దుబాయ్కి పోయిన. అక్కడ ఎన్నో కష్టాలు పడి నాలుగు రాళ్లు సంపాదించిన. నాలుగు ఎకరాల భూమికి తోడు మరో మూడెకరాలు కొన్న. మా ఊరు మీది నుంచి వరద కాలువ పోయినా మాకు పెద్దగా లాభం లేదు. నాకు ఓ కొడుకు, బిడ్డ. వారి చదువుల కోసం అక్కడే ఉన్న. 2014ల తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడుతాయన్న నమ్మకం మొదలైంది.
దుబాయ్ నుంచే నాలుగైదు రోజులకు ఓసారి ఇంటికి ఫోన్ చేసి ఎట్లుంది పరిస్థితి..? అని అడిగేది. 2016లో సీఎం కేసీఆర్ సార్ వరద కాలువను ఆధారంగా చేసుకొని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం చేపట్టిండని తెలిసింది. ఇంకా మా ఊళ్లేనే పంప్హౌస్ కట్టిండని పొలాలకు పుష్కలంగా నీళ్లస్తున్నయని అంటే మస్తు సంబురపడ్డా. ఇంకా 24 గంటల కరెంట్ కూడా వస్తున్నదని, ఎవుసం పండగులా అయిందని చెప్పిన్రు. ఇంకా పెట్టుబడి కోసం ఎకరానికి ఏడాదికి రూ.10వేలు ఇస్తున్నరని తెలిసి నమ్మలేకపోయిన. ఇంటోల్లు, సోపతోళ్లు, ముఖ్యంగా నా కొడుకు, బిడ్డ.. ‘నాన్న దుబాయ్కి ఎందుకు..? ఇంటికి రా.. ఇక్కడే మన ఏడెకరాల భూమిలో ఎవుసం చేద్దామని అంటే ఆలోచించిన.
2020 ఫిబ్రవరిలో దుబాయ్ వీసాను ఫినిష్ చేసుకొని ఇంటికి చేరిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరును చూస్తే జన్మల ఎప్పుడు కలగని సంతోషమైంది. సాగుకు పుష్కలంగా నీళ్లు, పచ్చని పొలాలు, 24 గంటల కరెంట్ను చూసి కడుపు నిండిపోయింది. పుట్టిన ఊర్లో, ఇరవై ఏండ్ల తర్వాత మళ్లీ ఎవుసం మొదలుపెట్టిన. మూడెకరాల్లో పసుపు, మక్క వేసిన. నాలుగెకరాల్లో వరి వేసిన. యాసంగి పెట్టుబడి సాయం మొన్ననే పడ్డది. ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.35వేలు వస్తున్నయి. అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లున్నది. కరెంట్ బిల్లు లేదు. ఊళ్లేనే కొనుగోలు కేంద్రంతో వడ్ల కొనుగోళ్లకు తిరిగే బాధ లేదు. రైతు బీమా పథకం పెట్టిండ్రు. ఇంత కంటే ఏం కావాలి..? ముఖ్యంగా రైతు బంధు వల్లే దుబాయ్ నుంచి తిరిగచ్చిన. నిజంగా రైతును రాజును చేసే పనిలో సీఎం కేసీఆర్ సార్ ఉన్నడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– బాసనపెల్లి శ్రీనివాస్, రాజేశ్వర్రావుపేట(ఇబ్రహీంపట్నం)
రైతు బాంధవుడు కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా రైతు కాబట్టి రైతులు పడే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తెలుసు. వరికి, పత్తికి మేలు జేసిండు. ఏం జేస్తె రైతుకు లాభం జరుగుతదో తెలిసి అట్ల మాకన్నీ జేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపిండు. 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం ఇస్తండు. ఒకప్పుడు మా గ్రామంలో బీడు భూములు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఎక్కడా ఖాళీ ఉండడం లేదు. పండిన పంటను సైతం మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటున్నది. రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే దానికి రైతు బాంధవుడు సీఎం కేసీఆరే కారణం.
– పిల్లి రామస్వామి, పిల్లిపల్లి, కమాన్పూర్.