కాళేశ్వర జల జాతర కొనసాగుతోంది. బాహుబలి మోటర్ల అజేయ యాత్రతో కరువునేల పులకిస్తున్నది. బీళ్లువారిన భూమి సస్యశ్యామలమవుతున్నది. ఇప్పటికే పునర్జీవ పథకంలో వరద కాలువలో ఎదురెక్కి ఎస్సారెస్పీని ముద్దాడి సాగునీటి రంగ చరిత్రలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించగా, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ రైతుల ఆశలను సజీవం చేసింది. మరోవైపు నిరంతర ఎత్తిపోతలతో ఇటు రాష్ర్టానికే వాటర్ జంక్షన్లా మారిన శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీటి మట్టం పెరుగుతున్నది. ఇక్కడి నుంచి ఓవైపు ఎల్ఎండీ, ఇంకోవైపు అనంతగిరి రిజర్వాయర్కు జలాలు తరలిపోతుండగా, ఈ సీజన్లో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, 122 కిలోమీటర్లు నిండుగా మారిన వరద కాలువ వెంట తూముల ద్వారా చెరువులు నిండుతుండగా, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఏడు రోజులు.. నిరంతరాయంగా..
కాళేశ్వరం లింక్-1, 2లో ఏడు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ప్రాణహిత జలాలను కాళేశ్వరం ద్వారా ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్కు ప్రాణహిత నుంచి 32,270 క్యూసెకుల ఇన్ఫ్లో ఉంది. గోదావరి ఎగువన వర్షాలు లేక నది ఎండిపోయి ఉంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిరంతర ఎత్తిపోతలతో రైతన్న సాగుకు భరోసానిస్తున్నది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యాలయ నిరంతర సలహాలు, సూచనలతో ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. ఆదివారం లింక్- 1, 2లో 22 మోటర్లను నడిపించారు.
బరాజ్లో నీటి నిల్వ..
గోదావరి దిగువన కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత నుంచి 32,270క్యూసెకుల ఇన్ఫ్లో ఉండగా లక్ష్మీ బరాజ్లో 16.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 10.88టీఎంసీలు నిల్వ ఉంది. సరస్వతీ బరాజ్లో 10.87 టీఎంసీలకుగాను 7.85టీఎంసీలు నిల్వ ఉంది. పార్వతీలో 8.83టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 5.95టీఎంసీలు ఉంది. ఎల్లంపల్లిలో 20.17టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 12.58టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లింక్ -1లో 18 పంపులు
కాళేశ్వరం లింక్-1లోని మూడు పంప్ హౌస్ల్లో అధికారులు 18 పంపులను నడుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్లో 7 మోటర్లను నడిపిస్తూ 15,400 క్యూసెకులు అదే జిల్లా అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపు హౌస్లోని 5 మోటర్లను నడిపిస్తూ 14,650క్యూసెకులను మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని ఆరు మోటర్లను నడిపిస్తూ 15,660 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
లింక్ – 2లో నాలుగు మోటర్లు
ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్కు వెళుతుండగా, అకడ రెండు బాహుబలి మోటర్లను నడిపిస్తూ 6300 క్యూసెకుల నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్కు తరలిస్తున్నారు. అక్కడా రెండు మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెకుల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా 5.7కిలోమీటర్ల దూరంలోని వరద కాలువలోకి తరలిస్తున్నారు. అక్కడ వరద కాలువ 102 కిలోమీటర్ మైలురాయి వద్ద శ్రీరాములపల్లి వద్ద ఉన్న జంక్షన్లో ఓ వైపు అటు ఎస్సారెస్పీ వైపు, మరోవైపు ఇటు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.
మరోవైపు ఎస్సారార్, ఎల్ఎండీ, అనంతగిరి
గాయత్రీ పంప్హౌజ్ నుంచి వస్తున్న జలాలతో మాన్వాడలోని ఎస్సారార్ రిజర్వాయర్ క్రమంగా నిండుతున్నది. ఇటు మరోవైపు నాలుగు గేట్ల ద్వారా ఎల్ఎండీలోకి, మరోపైపు ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ పంప్హౌస్కు చేరుతున్నది. ఇక్కడ నాలుగో మోటర్ ద్వారా నీటిని అనంతగిరి నిజలాశయంలోకి ఎత్తి పోస్తున్నట్లు డీఈ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ప్రతి రోజు 2800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు చెప్పారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నట్లు వివరించారు.
ఎస్సారెస్పీలోకి ఉరకలు
గాయత్రీ పంప్హౌస్ నుంచి తరలివస్తున్న జలా లు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5800 క్యూసెక్కుల జలాలు మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట(వరదకాలువ 34వ కిలోమీటరు) వద్ద నిర్మించిన పంపుహౌస్కు చేరుతుండగా, ఇక్క డ మూడు మోటర్ల ద్వారా 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. వరద కాలువలో ఎదురెక్కుతున్న జలాలు నిజామాబాద్ జిల్లాలోని ము ప్కాల్(వరదకాలువ 0.10 కిలోమీటర్) పంపుహౌస్ మీదుగా ఎస్సారెస్పీకి ఉరకలేస్తున్నాయి.
కాళేశ్వరం లేకపోతే సాగు ఆగమయ్యేది
సీఎం కేసీఆర్ సార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువును ఎదుర్కోవచ్చనే నమ్మకం కలిగింది. ప్రాజెక్టు మీద కొందరు ఏదేదో మాట్లాడుతున్నరు…? అవసరమా అంటున్నరట..? ఇప్పుడు వానాకాలం మొదలై నెల రోజులవుతున్నా వాన జాడలేదు. వేసిన విత్తులు మొలక రాక మొగులు వంక చూస్తున్నం. నారు పోయాలంటేనే భయమైతుంది. ఏది పడితే అది మాట్లాడుతున్నోళ్లకు మా బాధ ఏం తెలుస్తది. మరి మా పొలాల పరిస్థితి ఏంటో వాళ్లే చెప్పాలి. ఇంత కరువు టైం ఆదుకుంటదనే కేసీఆర్ సార్ కాళేశ్వరం కట్టిండు. మూడు రోజుల నుంచి మా గ్రామంలోని పంపుహౌస్కు పుష్కలంగా నీళ్లు వస్తున్నయి. వరద కాలువ నిండుగా మారింది. సమీపంలోని బావులల్ల నీళ్లు ఊరుతున్నయి. ఇంకా వరద కాలువ తూము ద్వారా మా గ్రామానికి పక్కనే ఉన్న బండలింగాపూర్ చెరువు నింపుతున్నరు. మాకు ధైర్యం వచ్చింది. వరి నారు పోసినం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే మా బతుకు ఆగమయ్యేది.
– మటేరు రాజశేఖర్, రైతు, రాజేశ్వర్రావుపేట(మెట్పల్లి మండలం)
సమృద్ధిగా పంటలు పండిస్తున్నాం
ఒకప్పుడు మా ఊరిలోనే కాకతీయ కాలువ ఉన్నప్పటికీ కాలువకు కింది భాగం డిస్ట్రిబ్యూటరీల సాయంతో పంటలు పండించేవాళ్లం. కాలువ ఎగువన ఉన్న భూములకు నీళ్లు రాకపోయేవి. అయితే, మా ఊరి భూములు 80 శాతం వరకు కాలువకు ఎగువనే ఉన్నయి. తలాపున గోదారి.. మా ఊరు ఎడారి.. అన్న సామెత మా పంటలు ఎండిపోయిన సందర్భంలో యాదికి చేసుకునేవాళ్లం. కానీ, కేసీఆర్ సార్ మా పక్క ఊరిలో పంప్హౌస్ నిర్మిస్తున్నరని తెలువంగనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మా ఊరు చెరువు నింపేందుకు తూము మంజూరు చేయించిండు. కొద్దిగా నీటి మట్టం ప్రవాహ స్థాయిలు కల్వకపోయినా, లోపలికి తవ్వి కొంతదూరం పైప్లైన్ వేసి ఆ తర్వాత ఫీడర్ చానల్ ద్వారా చెరువులకు నీళ్లు వచ్చేటట్లు చేసిండ్రు. మంగళవారం నుంచి వరృదకాలువ పంప్హౌస్ మోటార్లు నడుస్తున్నయనే సమాచారం రావడంతో మాకు చాలా సంతోషం వేసింది. మా ఊరి పెద్ద చెరువుకు నీళ్లు వస్తుండడం వల్ల సమృద్ధిగా పంటలు పండించే అవకాశం ఉంది. వర్షాల కోసంచూడకుండా నాట్లు వేసుకుంటం.
– నక్కల రవీందర్రెడ్డి, రైతు, అంతర్గాం (జగిత్యాల జిల్లా)
రెండు పంటలకూ నీళ్లందుతున్నయ్..
నా పేరు బొడ్డు అంజయ్య. మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం. నాకు నంది రిజర్వాయర్ కింద 15 గుంటల భూమి ఉంది. డ్యాం తూము నుంచి వచ్చే నీళ్లతోనే పంటలు సాగు చేస్తున్న. ఇదివరకు మా ఊరిలో పెద్ద చెరువు ఉండేది. వానాకాలం వస్తేనే చెరువు నిండి పంటలకు నీరందేది. కాలంకాకపోతే పొలం బీడుపెట్టుడే. కానీ సీఎం కేసీఆర్ సారు మా చెరువును పెద్దది చేసి కాళేశ్వరం నీళ్లతో నింపుతండు. ఇకడి నుంచే రాష్ట్రమంతా నీళ్లిస్తండు. డ్యాంకు తూము పెట్టడంతో మా భూములకు రెండు పంటలకూ ఫుల్లుగా నీళ్లందుతున్నాయి. ఈ సారి వానలే పడలే. ఒకవేళ కాళేశ్వరం నీళ్లు రాకపోతే మా పొలాలన్నీ బీడు పెట్టుడే అయితుండె.
మొదటి ఫలితం మాకే దక్కింది..
నా పేరు బొడ్డు నరసయ్య. మాది ధర్మారం మండలం నంది మేడారం. నాకు రిజర్వాయర్ కింద కొంత భూమి ఉంది. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితం మాకే దక్కింది. రిజర్వాయర్ అయినంక మొట్ట మొదట పొలాలకు నీళ్లు వాడుకున్నది మా రైతులే. కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ నుంచి మా ఊరి రిజర్వాయర్లోకి వస్తయి. రిజర్వాయర్ నుంచి మా పొలాలకు అందుతున్నాయి. ఏటా రెండు పంటలు పండించుకుని రైతులమంతా ఆనందంగా ఉన్నం.