ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ఉద్యానవన, వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, ఇతర సదుపాయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మంచి నూనె తీవ్ర కొరత ఉన్న నేటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా సాగు చేయాలని సంకల్పించింది. ఒక హెక్టారుకు 4 నుంచి 5 టన్నుల నూనెను ఉత్పత్తి చేసే అవకాశమున్నది. పామాయిల్లో సాచురేటెడ్, అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమతుల్యతలో ఉంటాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ శాతాన్ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ శాతాన్ని పెంచుతుం ది. యాంటీ ఆక్సిడెంట్గా పని చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలోని లక్షణాలు స్థిరంగా ఉన్నందున అనేక రకాల వంటలకు ఈ ఆయిల్ను వినియోగిస్తారు. నూనె తీయగా వచ్చిన వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా, జీవ ఇంధనంగా, మల్చ్గా వినియోగిస్తారు. ఐస్క్రీములు, సౌందర్య ఉత్పత్తులు, బేకరీ పదార్థాలలోనూ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్కు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాగు చేసిన మూడేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు నిరంతరాయంగా దిగుబడి ఇస్తుంది. ప్రతి సీజన్లో ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీస ధర 10 వేలకు తక్కువ ఉండదని అధికారులు అంటున్నారు. అంతే కాకుండా పంటలో అంతర పంటలు కూడా సాగు చేసుకుని లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో 2,500 ఎకరాల్లో లక్ష్యం
వచ్చే మార్చి వరకు 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ను విస్తరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఈ యేడాది 11,400 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా, నర్సరీలో మొక్కలు ఎదిగి వచ్చిన తీరుగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి వరకు ఉన్న లక్ష్యంలో ఇప్పటికే 1,674 ఎకరాలకు డీడీలు చెల్లించారు. అందులో 250 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మంత్రి గంగుల కమలాకర్ తన క్షేత్రంలో ఈ పంటను సాగు చేయడమే కాకుండా జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరో పక్క ఉద్యాన శాఖతో పాటు వ్యవసాయ శాఖకు కూడా బాధ్యతలకు అప్పగించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ రెండు శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఉద్యన శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీధర్తోపాటు ఉద్యాన అధికారులు, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ పంటను సాగు చేసేందుకు రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
భారీగా రాయితీలు
రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నది. నీటి యాజమాన్యాన్ని ప్రోత్సహించేందుకు బిందు సేద్యం పద్ధతిలో మైక్రోజెట్ల ద్వారా నీటిని అందించేందుకు ఉద్యానవన శాఖ ద్వారా రాయితీ అందిస్తున్నది. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు జీఎస్టీ మినహాయించి వంద శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న బీసీ, ఓసీ రైతులకు 90 శాతం, 5 ఎకరాలు పైబడితే 80 శాతం సబ్సిడీ అందజేస్తున్నది. అంతే కాకుండా మొక్కలు నాటిన నుంచి ఎరువులు, పురుగుల మందులు, నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఎకరాకు ఏటా 2,100 చొప్పున నాలుగేళ్ల పాటు 8,400, అంతర పంటల ఖర్చుల కోసం ప్రతి ఎకరాకు ఏటా 2,100 చొప్పున నాలుగేళ్ల పాటు మరో 8,400 చొప్పున ఇవ్వనున్నది. మొక్కలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నది. ఒక్కో మొక్క ఖరీదు 193 కాగా, 170 రాయితీ అందిస్తున్నది. అంటే ఒక్కో మొక్కకు 20 చెల్లిస్తే కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడిలో ఉన్న నర్సరీ నుంచి మొక్కలు అందిస్తున్నారు. ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున డీడీలు చెల్లించారు.
వరిని 20 శాతం తగ్గించే లక్ష్యం
నీటి వనరులు పుష్కలంగా లభిస్తున్న ఉమ్మడి జిల్లాలో ఏటా రెండు పంటల్లో వరి అగ్ర స్థానంలో ఉంటున్నది. వరి సాగు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఒక పక్క అధిక నీటి వినియోగం, మరోవైపు కాలుష్యం పెరుగుతున్నది. ఆరుతడి పంటల విస్తీర్ణం ఆశించిన రీతిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 20 శాతం వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ను ప్రోత్సహించాలని అధికారులు యోచిస్తున్నారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండగా, పదెకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులను వ్యవసాయ, ఉద్యాన అధికారులు నేరుగా సంప్రదిస్తున్నారు. ఆయిల్ పామ్పై అవగాహన కల్పిస్తున్నారు. సాగుతో దీర్ఘకాలం కలిగే లాభాలు, ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్నారు.