ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 12: షేర్ మార్కెట్ పేరిట అమాయకులకు రూ. 2.11 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఐదు నెలలుగా తప్పించుకున తిరుగుతున్న ఘరానా చీటర్ రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. మంగళవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రెమో రాజేశ్వరి నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. మంచిర్యాలకు చెందిన చెవ్వా రవి షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే భారీగా నగదు వస్తుందని ఆశ చూపి మోసం చేశాడని పలువురు ఆరు నెలల కిందట రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీపీ టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. రవి మంగళవారం హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో టాస్క్ఫోర్స్, మంచిర్యాల పట్టణ పోలీసు సంయుక్తంగా కలిసి నిందితుని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి క్రెడిట్ కార్డ్స్, బ్యాంకు పాస్బుక్స్, చెక్బుక్స్, రిజిస్టార్ బుక్, నగదు 8,100 స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసినట్లు సీపీ తెలిపారు.