జగిత్యాల రూరల్, మే 29: అన్నింటికన్నా గీతకార్మికుల వృత్తి ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గీతకార్మికులను ఆదుకోవాలని, అగ్నిప్రమాదాలకు గురైన తాటి, ఈత వనాలకు పరిహారం అందించాలని సూచించారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొరండ్ల, కన్నాపూర్ గ్రామాల్లో కాలిపోయిన ఈత, తాటివనాలను శుక్రవారం ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడారు. వేసవిలో వడగాలులతో ఈత వనాలు కాపోతున్నాయని, రోజూ ఎక్కడో ఒకచోట ఈత, తాటి వనాలు కాలిపోయిన సంఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా పంట పరిహారం అందిస్తున్నదో.. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈత వనాలు ప్రమాదానికి గురయ్యాయో అక్కడ తిరిగి చెట్లు నాటుకోవడానికి గీత కార్మికులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని 21 గ్రామాల్లో ఈత, తాటి వనాలు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయని చెప్పారు.
ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఎక్కడున్న ప్రతి గీత సహకార సంఘానికి ఐదెకరాలు స్థలం ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నర్సింగాపూర్లో కూడా ప్రభుత్వ స్థలాలు లేకుంటే కొనుగోలు పథకం కింద ఐదెకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఇప్పిస్తే ఈత, తాటి వనాలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. గ్రామగ్రామాన బెల్టు షాపుల నిర్వహణతో గీతకార్మికులకు నష్టం జరుగుతున్నదని వాపోయారు.
బెల్టు షాపులతో ఎంత ఆదాయం వస్తుందో తెలియదుగానీ, వైద్యపరంగా గ్రామాల్లో లక్షకోట్లకు పైగా ప్రతి సంవత్సరం నిరుపేద కుటుంబాలపై భారం పడుతున్నదని ఆవేదన చెందారు. వైన్ షాపులు, బెల్టు షాపులపై పెట్టే శ్రద్ధ్ర గీతకార్మికులపై పెడితే ఉపాధి దొరుకుతుందని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రాష్ట్ర సర్కారు గీతకార్మికుల ఉపాధికి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీ రమేశ్ బాబు, మాజీ సర్పంచ్ చంద రాధాకిషన్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.