ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. సమయం సందర్భం లేకుండా.. భారం మోపుతున్నది. తాజాగా మరో 50 పెంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుసగా 2020, 2021లో వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్రం, కొద్దినెలలుగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచలేదు. ప్రస్తుతం ఎన్నికలు లేని సమయాన్ని చూసి కేంద్రం ఇచ్చిన సిగ్నల్స్ మేరకు చమురు సంస్థలు మరోసారి గ్యాస్పై బాదాయి. ఇప్పటికే వంటి గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయి. నిజానికి 2022 ఫిబ్రవరిలో గృహా అవసరాలకు వినియోగించే 14.2 కేజీ సిలిండర్ ధర 841.50 ఉండగా, ప్రస్తుతం అది 1175కు చేరింది. అంటే ఏడాది కాలంలోనే 334 పెరిగింది. నిజానికి 2014 మార్చిలో ఇదే సిలిండర్ ధర 410 ఉండగా, ప్రస్తుతం పెరిగిన ధరను చూస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో సిలిండర్పై 765 వరకు పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
5.14 కోట్ల భారం
గృహావసరాల సిలిండర్పై తాజాగా 50 పెరుగడం వల్ల ఉమ్మడి జిల్లాపై భారీగా భారం పడుతున్నది. పూర్వ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి 10,28,574 కనెక్షన్లున్నాయి. అయితే అందులో కొన్ని కుటుంబాలకు నెలకు రెండు లేదా మూడు సిలిండర్లు వాడే వారు ఉన్నారు. అలాగే కొన్ని కుటుంబాలు ఒకటి రెండు నెలలకు కూడా ఒకే సిలిండర్ వాడే వారున్నారు. ఆయా కుటుంబాల పరిస్థితులతోపాటు నిత్యం గ్యాస్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా జరుగుతున్న సిలిండర్ల సరఫరాను పరిశీలిస్తే దాదాపు ప్రతి కుటుంబం నెలకు ఒక సిలిండర్ చొప్పున వినియోగిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే.. పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు 5.14 కోట్లకుపైగా భారం పడుతున్నది. వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు కూడా ఉమ్మడి జిల్లాలో లక్ష కుపైగానే ఉన్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్పెంపు వల్ల సంబంధిత వ్యాపారులు వారు ఉత్పత్తిచేసే వస్తువులు, తినుబండరాలు, లేదా ఇతర వస్తువుల ధరలు కూడా పెంచనున్నారు. ఈ ప్రభావం కూడా తిరిగి ప్రజలపైనే పడనున్నది.
రాయితీకి మంగళం
గతంలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్కు రాయితీ ఇచ్చే వారు. ఆ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకులో జమయ్యేది. రాను రాను సబ్సిడీ తగ్గించారు. చివరికి 45కి తెచ్చారు. గత కొద్ది నెలులుగా కేంద్రం దానికీ మంగళం పాడి ఆ భారాన్ని చమురు కంపెనీలపై మోపింది. ఆ కంపెనీలు కూడా మూడు నాలుగు నెలలుగా రాయితీ సొమ్మును ఖాతాల్లో జమచేయడం లేదు. ఇదే సమయంలో ఉజ్వల యోజన పథకం, అలాగే గ్యాస్ రాయితీ కోసం కేంద్రం గతంలో సాధారణ బడ్జెట్ నిధుల కేటాయింపులు చేసేది. తాజా బడ్జెట్లో రిక్తహస్తం చూపింది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పథకానికి గానీ రాయితీకి గానీ ఒక్కపైసా కేటాయించలేదు. ఈ విషయాన్ని గమనించి చమురు కంపెనీలు కూడా సబ్సీడికి దాదాపు మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాయితీ ఇవ్వకపోగా ధరలు మాత్రం రోజురోజుకు పెంచుతూ వస్తున్నారు. అంతేకాదు, నిపుణుల అంచనా ప్రకారం చూస్తే ఈ గ్యాస్ మంటలు ఇప్పట్లో ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం పూర్తిగా తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో చమురు కంపెనీలు మరోసారి పెంచడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న ప్రచారం జరుగుతున్నది.
మండిపడుతున్న ప్రజలు
తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినంటిన విషయం తెలిసిందే. పప్పులు, ఉప్పులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని ఇప్పటికే.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవిచాలవన్నట్లుగా ప్రతి దానిపై జీఎస్టీని కేంద్రం బాదుతున్నది. అయితే ప్రతి కుటుంబం వంటింటికీ వినియోగించే సిలిండర్ ధరలను ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల సామన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు సిలిండర్ను మూలన పడేసి కట్టెల పొయ్యిపైనే ఆధార పడుతున్నారు. దీని వల్ల ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అటవీ సంపద కేంద్రం నిర్వాకం వల్ల మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. దేశం కోసం ధర్మం కోసం అంటూ గొప్పలు చెప్పే బీజేపీ నేతలు భారత్ వెలిగిపోవడం అంటే వంటింట్లో మంటలు పెట్టుడేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
దండం పెడుతున్న ధరలు తగ్గించాలె
అసలే మాది రెకాడితే డొకాడని కుటుంబం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచి మాపై మోయలేని భారం వేసిన్రు. మళ్లీ వంటగ్యాస్ ధరలు పెంచిన్రు. ఆ ధరలు చూస్తుంటే మాకు ఎనకటి లెక్క మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది. ఓ పక్క గ్యాస్ పొయ్యి వాడాలని మోడీ సారు అంటూనే ఈ ధరలు పెంచుడు ఏందో అర్థమైతలేదు. ముంగట తియ్యటి మాటలు మాట్లాడుతూ.. వెనుక ఇలా ధరలు పెంచి మా పొట్టకొడుతండు. గుడిసెలో బతికే మా పరిస్థితి ఏంటి? దండం పెట్టి వేడుకుంటున్న, గ్యాస్ ధరలు దించాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతం.
– దాసరపు మధునమ్మ మామిండ్లవాడ(హుజురాబాద్టౌన్)
కనికరం లేదు
వంట గ్యాస్ ధర ఇట్లా పెంచుకుంటపోతే సిలిండర్ వాడుడు బంజేత్తం. ఇంత ధర పెట్టి కొనలేక పోతున్నం. మాకైతే 40-50 రోజులకొక సిలిండర్ అవసరం ఉంటది. ఏడాదిల ఎంత భారం పడుతున్నదో ఆలోచిస్తే భయమేస్తున్నది. కేంద్రంల బీజేపీ ప్రభుత్వం వచ్చినంకనే గ్యాస్ రేటు బాగా పెరుగుతున్నది. అప్పట్లో అన్ని వంటలు సిలిండర్మీదనే చేసుకునేటోళ్లం. ఇప్పుడు చాయ్ పెట్టుకుందామన్నా భయమైతంది. మా లాంటి సామాన్యుల మీద కేంద్రానికి కొంచెమైన కనికరం లేదు. ఇట్లయితే బతుకుడు కష్టమే.
– గూడుపాటి అనిత, గృహిణి, వెంకటేశ్వరకాలనీ (కరీంనగర్)
సిలిండర్ అంటే భయపడుతున్నం..
మాది జగిత్యాల. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని బతికేటోళ్లం. సిలిండర్ పేరు వింటేనే భయమైతుంది. కానీ ఏం చేస్తం. ఎంత బాధైనా వంట చేసుకోవాలంటే పట్టణాల్లో ఉండే మాకు గ్యాస్ పొయ్యే దిక్కు. ఎనిమిదేండ్ల కింద రూ.450 దాకా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం నాలుగంకెలకు చేరింది. ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నయి. నెల వారీ బడ్జెట్ అయిదంకెలకు చేరింది. ఇక ఏం తింటం? ఎలా బతుకుతం. గతంలో బ్యాంకులో సబ్సిడీ జమ చేసిన కేంద్రం, ఇప్పుడు అది కూడా బంద్ చేసింది. రూపాయి కూడా వస్తలేదు. కేంద్రం పద్ధతి సరికాదు.
-కత్రోజు సరిత, జగిత్యాల
కట్టెల పొయ్యిమీదే వండుతున్న..
మేం గరిబొళ్లం. దొరికిన పని చేసుకుంట, బండలు కొట్టుకుంట బతుకుతం. అప్పట్ల గ్యాస్ ధర తక్కువున్నదని సిలిండర్ కొనుకున్నం. కానీ మూడేండ్ల సంది వంట గ్యాస్ రేటు పెరుగతనే ఉన్నది. ఇగ ఇప్పుడైతే పదకొండు వందలు దాటింది. అందుకే గ్యాస్ బుక్ జేసుడు బంజేసినం. అక్కడిక్కడ కట్టెలు ఎరుకొని తెచ్చి వండుకుంటున్నం. ఓట్లచ్చినప్పుడు ధరలు పెంచిన వారిని కిందకు దింపుతం.
-బోదాసు రాజమ్మ, చింతకుంట (కథలాపూర్)
కట్టెల పొయ్యే దిక్కయితది.
కేంద్రం వంట గ్యాస్ ధరను పెంచి పేదొళ్లను ఆగం చేస్తున్నది. రెండేండ్ల కిందట కరోనా అని చెప్పి మూడింతలు జేసింది. ఇప్పుడు ఏ కారణంలేకుండానే మళ్లా యాభై రూపాయలు పెంచి గరిబోళ్లను మోసం చేసింది. ఇగ గ్యాస్ రేటు గిట్ల పెరిగితే కట్టెల పొయ్యే దిక్కయితది.
-కోరెపు మౌనిక, నేదునూర్ (తిమ్మాపూర్ రూరల్)
బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలి
నిరుపేదల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు కృషి చేస్తోంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదల కడపుకొడుతున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులను ఆగం చేస్తున్నది. అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ముఖ్యంగా గ్యాస్ ధరలను మూడుసార్లు పెంచి పేద, మధ్య తరగతి వర్గాలపై పెను భారం మోపింది. మోదీ రాకముందు సిలిండర్ ధర 400 ఉంటే, ఇప్పుడు సుమారు 1200 అయింది. వేల కోట్లు దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థలను పట్టించుకోకుండా.. ఎవరైనా మాట్లాడితే వారిపై ఐటీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నది. ధరలు పెంచుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంకావాలి. శుక్రవారం అన్ని గ్రామాల్లో వంట గ్యాస్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలతో కలిసి ఉద్యమించి గద్దె దించాలి.
– మెట్పల్లిలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
కేంద్రంపై పోరాటం తప్పదు
బీజేపీ ప్రభుత్వ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నడు. నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నదని ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచి మంట పెట్టింది. ఒకప్పుడు 400 ఉన్న సిలిండర్ ధర, ఇప్పుడు 1175కు చేరిందంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉడకేసుకొని పచ్చడితోనైనా పట్టెడన్నం తిందామనే పరిస్థితి లేకుంటా చేస్తున్నది. పేదలకు కట్టెల పొయ్యే దిక్కన్నట్లుగా రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే ఊరుకునేది లేదు. ధరలు దించేదాకా కేంద్రంపై పోరాటం తప్పదు. ఈ నెల 3న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి మహాధర్నా చేసి నిరసన తెగ తగిలిస్తం.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
బీజేపీని గద్దె దించుడే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచడమే పనిగా పెట్టుకుంది. 2014లో 400 ఉన్న సిలిండర్ ధర ఈ రోజు రూ.1155 పెంచింది. ఇంత దారుణంగా ధరలు పెంచుతూ పోతే పేదలు ఎలా బతుకుతారు. ఇప్పుడిప్పుడే కట్టెల పొయ్యి వదిలి గ్యాస్ పొయ్యిల వైపు మల్లుతున్న పేదలు మళ్లీ పొగచూరిన బతుకుల్లోనే మగ్గాల్సిన పరిస్థితి తెచ్చింది. గ్రామాల్లో బీజేపీ పాప్కార్న్ మీటింగ్ పెట్టి వేదాలు వల్లిస్తున్నది. దమ్ముంటే ఆ పార్టీ నాయకులు సిలిండర్ ధరలపై వివరణ ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే గుండెలు బాదుకుంటూ నిరసనకు దిగిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ఇప్పుడు మాట్లాడాలి. దేశ ప్రజలకు గుదిబండగా మారిన బీజేపీని గద్దె దించాలన్న ఆలోచనలో ఉన్నరు. ధరలు దించేదాకా కేంద్రంపై పోరాటం తప్పదు. 3న నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకు లు, ప్రజలతో కలిసి నిరసనలు చేపడుతాం.
– గంగాధర మండలం బూరుగుపల్లిలో విలేకరులతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (చొప్పదండి/గంగాధర)