వేములవాడ, సెప్టెంబర్ 2 : వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. అందుకు ఆరు ట్రాక్టర్లు, 25 ఆటోలు వినియోగిస్తున్నారు. వీటితోపాటు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్బ్లేడ్ ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పట్టేందుకు మరో రెండు వాహనాలు ఉపయోగిస్తున్నారు. అంచనా ప్రకారం.. ఈ వాహనాల కోసం రోజు వారీగా దాదాపు 150 లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. నెలకు దాదాపు 4,500 లీటర్లు అవసరమవుతుండగా, ఇందుకు 4.50 లక్షల వరకు ఖర్చవుతున్నది.
అయితే డీజిల్ వినియోగంలో అవినీతి జరిగినట్లు తెలుస్తున్నది. గత ఐదు నెలల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని పరిశీలించిన అధికారులు అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ యేడాది మార్చిలో 5.5 లక్షలు, ఏప్రిల్లో 6.20 లక్షలు, మేలో 6.10 లక్షలు, జూన్లో 7.73 లక్షలు, జూలైలో 5.45 లక్షల చొప్పున డీజిల్ కోసం ఖర్చు చేసినట్లు రికార్డులు చూపగా, ఈ బిల్లులు చూసి కమిషనర్ అవాక్కయ్యారు. నెల వారీగా ఏ మేరకు డీజిల్ వినియోగించారో రికార్డులు చూపాలని ఆదేశించినా.. సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వహించడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నోటీసులు కూడా జారీ చేశారు. సుమారు 8 వేల లీటర్ల వరకు డీజిల్ దుర్వినియోగమైనట్లు గుర్తించి, శాఖాపరమైన విచారణ చేపడుతున్నారు. ఆగస్టులో నేరుగా నగదు చెల్లించి డీజిల్ కొనుగోలు చేయగా.. కేవలం 4 లక్షల వరకే ఖర్చయినట్లు కమిషనర్ శ్యామ్సుందర్రావు తెలిపారు.
చర్యలు తీసుకుంటాం
శానిటరీ విభాగంలో దుర్వినియోగమైన డీజిల్ వ్యవహారంలో ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. నెల రోజులకు సుమారు 4500 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ఇందుకోసం 4 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, ఒక్కో నెల ఒక్కోలా బిల్లులు రాశారు. దాదాపు 8 లక్షల వరకు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. పై అధికారుల ఆదేశాలతో సదరు ఉద్యోగిపై కూడా చర్యలు తీసుకుంటాం.
– శ్యామ్సుందర్రావు, వేములవాడ మున్సిపల్ కమిషనర్