కరీంనగర్ కార్పొరేషన్, జూలై 12 : అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఓటర్ల సందేహాలను తీర్చేందుకు ఓటరు నమోదు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కిసాన్నగర్, చింతకుంటలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రభుత్వ యంత్రాంగం, బీఎల్వోల సమన్వయ లోపం కారణంగా నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ నెల 24లోగా మిగిలిన ప్రక్రియను ముగించాల్సి ఉందని, ఆన్లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేరొన్నారు. అందుకే బీఆర్ఎస్ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్లైన్లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తున్నదని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినిమోగించుకోవాలని, తమ ఓటు హకును భద్రపరుచుకోవాలని పిలుపునిచ్చారు.