‘ఈ కొద్ది రోజులు మా కోసం పనిచేయండి. అరవై నెలలు మీ కోసం సేవ చేస్తా’అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మూలాలు ఢిల్లీలో ఉన్నాయని, ఆ పార్టీల రూపంలో మళ్లీ ఆంధ్రా నాయకులు తెలంగాణకు వచ్చి మళ్లీ ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని పార్టీల నుంచి భూ కబ్జాకోరులు, దొంగలు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం గోపాల్పూర్, నగరంలోని మీసేవా కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్పొరేషన్/ కొత్తపల్లి, అక్టోబర్ 13 : కొద్ది రోజులు మా కోసం పనిచేస్తే ఐదేండ్లు మీ కోసం సేవ చేస్తానని యువకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీనిచ్చారు. యువతీయువకుల భవిష్యత్తుకు భరోసా తనదేనని, వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. కొత్తపల్లి మండల ప్రజలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, తనను నాలుగోసారి గెలిపిస్తే సేవకుడిగా ఉంటానన్నారు. తనకు ఓటు వేస్తే మీ కుటుంబ సభ్యుడికి ఓటు వేసినట్లుగానే భావించాలని సూచించారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట ఎస్వీఆర్ ఫంక్షన్హాల్లో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు అధ్యక్షతన శుక్రవారం జరిగిన యువకుల ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు 40 ఏండ్ల పాటు కరీంనగర్ను పాలించారని, అయినా కనీసం గ్రామానికి ఒక్క రోడ్డుకూడా వేయించలేదని గుర్తు చేశారు.
తాను ఎన్నికల ప్రచార సందర్భంలో కనీసం బైక్పై కూడా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డును కలుపుతూ ప్రతి గ్రామానికి వేసిన రోడ్లు, ఇంటింటికీ తాగునీరు, 24 గంటల కరెంట్, పుష్కలమైన సాగునీరు సాధ్యమైందని చెప్పారు. దీనిని యువత గుర్తుంచుకోవాలని కోరారు. కొత్తపల్లి మండలంలో సుమారు 100 కోట్లతో పద్మనగర్ నుంచి ఒద్యారం వరకు ఫోర్లైన్, సెంట్రల్లైటింగ్, కరీంనగర్ నుంచి ఎలగందుల వరకు నేరుగా బ్రిడ్జి, ఖాజీపూర్లో 25 కోట్లతోపాటు ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం సంతృప్తినిచ్చిందన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ వారికి జవాబుదారీగా ఉన్నానన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనులు చేశానని, ఇప్పుడు కరీంనగర్లో గుంతలు పడ్డ రోడ్లు చూద్దామన్నా కనిపించడం లేదన్నారు. తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేని ఆంధ్రానాయకులు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి కుట్రలు చేస్తున్నారని, వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమైక్య పాలనలో నీళ్లు, వసతులు లేక అరిగోస పడ్డ పరిస్థితుల నుంచి స్వయం పాలనలో కాళేశ్వర జలాలతో నిండుగా పంటలు పండే స్థాయికి వచ్చామని తెలిపారు. రూ.వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయటంతో నియోజకవర్గంలోని నగరంతోపాటు, గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే తెలంగాణకు సీఎం కేసీఆరే రక్షణ అని సూచించారు.
పర్యాటకకేంద్రమైన ఎలగందుల గ్రామం నుంచి హైదరాబాద్కు నేరుగా రోడ్డు మార్గం వేయిస్తానన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ఫ్రంట్తో పాటు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి హైదరాబాద్కు దీటుగా మారిందన్నారు. ఎన్నికలనగానే కరీంనగర్లో భూకబ్జాదారులు, పలు కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లు పోటీ చేసేందుకు వస్తున్నారని, వారిని నమ్మవద్దని హితవు పలికారు. ఎంపీ సంజయ్ చేస్తున్న గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు. కరీంనగర్ గంజాయి రహితంగా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. తనకు సోదర సమానుడైన యువ నాయకుడు, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు నిజాయితీ, నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిగా ఎదిగాడని, తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడం తమ బాధ్యత అని హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ మాట్లాడుతూ, కరీంనగర్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ భారీ మోజార్జీతో గెలవబోతున్నారని, ప్రజల నుంచి ఆయనకు విశేషంగా వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు.
ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఆపద వస్తే ఆదుకొనే ఏకైక నాయకుడు గంగుల కమలాకరేనని స్పష్టం చేశారు. మండలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులతో 8కి 8 గ్రామాల ప్రజలు బీఆర్ఎస్వేపే ఉన్నారని, ఇక్కడ బీఆర్ఎస్ తప్ప మరోపార్టీకి చోటు లేదన్నారు. కరీంనగర్లో అభివృద్ధి కొనసాగాలంటే ఒక్కో యువకుడు 15 ఓట్లు వేయించి భారీ విజయాన్ని అందించి మంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. 18 నుంచి ఎన్నికల కదనరంగంలో దిగుతామని, బీఆర్ఎస్ సైనికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, సమ్మేళనంలో పలు గ్రామాల నుంచి 800కుపైగా యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని మరోసారి గెలిపించుకుంటామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, ఎన్నికల యూత్ ఇన్చార్జి గంగుల ప్రదీప్, గంగు ల హరిహరణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు జినుక సంపత్, నాయిని ప్రసాద్, రాచమల్ల మధు, ఎంపీటీసీలు భూక్య తిరుపతినాయక్, మంద రమేశ్గౌడ్, దావ కమల మనోహర్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి మహేశ్, పిట్టల రవి, ఉప్పు శ్రీనివాస్, జయప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా విఫలమైంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఇక్కడ ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఎలా ఇస్తారో ఓటర్లు ఆలోచించుకోవాలి. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మద్దు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలి.
– మంత్రి గంగుల కమలాకర్