కోల్సిటీ, సెప్టెంబర్ 9: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతారు. నిమజ్జనం రోజు వేలం పాడి మరి చేజిక్కించుకుంటారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా లో పలువురు భక్తులు ఇలానే లడ్డూను దక్కించుకున్నారు. అత్యధికంగా లక్షా 50వేలకుపైగా వేలం పాట పాడి మరీ చేజిక్కించుకున్నారు.
కరీంనగర్లోని సూర్యానగర్లో అరుణ్కుమార్ రూ.1,16,116కు.. రాంనగర్ చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో పూజలందుకున్న గణనాథుడి వద్ద ఉంచిన లడ్డూను రాజశేఖర్ దంపతులు రూ. లక్షా పదహార్లకు.. గన్నేరువరం మండలం జంగపెల్లిలో చిలవేరు మల్లేశం రూ.58116కు.. జమ్మికుంట మేదరివాడలో వినాయక మండపంలో ఓ భక్తుడు రూ.42,100కు లడ్డూలను దక్కించుకున్నారు.
జగిత్యాల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో గణనాథుని లడ్డూ వేలం వేయగా, రూ. 1.15లక్షలకు శ్రీ రామ్ సేన సభ్యులు దక్కించుకున్నారు. జగిత్యాల పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ మండలిలో లడ్డూ వేలం వేయగా, రూ. 1.59 లక్షలకు చెన్నమనేని పవిత్ర, రాంబాబు రావు దక్కించుకున్నారు. ప్రైమ్ హైట్స్లోని వినాయకుడి లడ్డూ వేలం వేయగా, రూ.40వేలకు గండ్ర సృజన, సతీశ్రావు దక్కించుకున్నారు.
పెద్దపల్లిలోని అమర్నగర్లో చౌరస్తాలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి వద్ద లడ్డూను వేలం వేయగా, గరిగంటి రాజేశ్ రూ.50 వేలకు.. గోదావరిఖనిలోని మల్లికార్జున్నగర్లో రూ.30 వేలకు అల్లం రాయమల్లు దక్కించుకున్నారు.