కమాన్చౌరస్తా, డిసెంబర్ 26 : విశ్వవిద్యాలయ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు 2023 సంవత్సరానికి ‘జీ 20’ శిఖరాగ్ర సమావేశం భారత్ నిర్వహించనున్న నేపథ్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ‘జీ 20- ఒక భూమి.. ఒక కుటుంబం’ అనే అంశంపై సోమవారం వ్యాసరచన, వ్యక్తిత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించినట్లు యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీవాణి పేర్కొన్నారు. 179 మంది విద్యార్థుల దరఖాస్తు ఫారాలు గూగుల్ ఫామ్ ద్వారా స్వీకరించి, అందులో 113 మందికి వ్యాసరచన, 20 మందికి ఉపన్యాస, 46 మందికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో జీ20 లోగో డ్రాయింగ్ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు.
ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల హాజరై మాట్లాడారు. ‘జీ-20’కి భారతదేశం వేదిక కానున్నందువల్ల భావి భారత పౌరులైన విద్యార్థినీవిద్యార్థులు జీ-20 గురించి అవగాహన పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం వరప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నజీముద్దీన్ మునావర్, అధ్యాపకులు, ప్రోగ్రాం ఆఫీసర్లు విజయ్ప్రకాశ్, విజయ్కుమార్, డాక్టర్ వై ప్రసాద్, విశ్వవిద్యాలయ పరిధిలోని ఆయా కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాస్, స్పందన, లావణ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.