మెట్పల్లి, డిసెంబర్ 21 : ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు ఆర్థిక స్థోమతలేక ఆందోళన చెందుతున్న నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు మెట్పల్లి పట్టణానికి చెందిన స్నేహితులు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట పెళ్లికూతురుకు అవసరమైన పుస్తెమట్టెలు, పట్టుచీరతో పా టు పెళ్లికి వచ్చే బంధుమిత్రుల కోసం భోజనానికి సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు, ప్లేట్లు, గ్లాసులు వంటి తదితర సామగ్రిని అందజేస్త్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
మెట్పల్లి పట్టణానికి చెందిన సుర్గి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో స్నేహితులు కలిసి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ను నిర్వహిస్తున్నారు. అనాథలు, యాచకులు, మతిస్థిమితంలేని అభాగ్యులు ఎందరికో ప్రతిరోజూ భోజనం, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అనేక మంది నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నోట్ పుస్తకాలు, సంవత్సరానికి సరిపడా స్టడీ మెటీరియల్ను ఉచితంగా ప్రతి విద్యా సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. కరోనా సమయంలో లాడ్డౌన్ సందర్భంగా వలస కార్మికులు, పేద కుటుంబాల ఆకలిని తీర్చేందుకు తమ వంతుగా ఆహార ప్యా కెట్లను పంపిణీ చేసి ఆదుకున్నారు.
ఇవే కాకుండా వైకుంఠ రథం, అంబులెన్స్, బాడీ ఫ్రీజర్ వంటివి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇవే కాకుండా సామాజిక సేవా దృక్ఫథంతో నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లి కోసం తమ వంతు సహాయం చేస్తూ వారి తల్లి దండ్రులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. 2021-22 సంవత్సరంలో (డిసెంబర్ 21 వరకు) 29 మంది నిరుపేద కుటుంబాలకు ఈ సాయం అందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికసాయం చేస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ను పలువురు ప్రశంసిస్తున్నారు.
కల్యాణలక్ష్మి స్ఫూర్తితో..
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకమే స్ఫూర్తి. తమ వంతు ఆడబిడ్డల పెళ్లికి ట్రస్ట్ ద్వారా సహాయం అందించి ఆదుకోవాలనే ఉద్దేశంతో వధువుకు పుస్తెమట్టెలు, పట్టుచీర, వంద మందికి పైగా సరిపడా కూరగాయల భోజనానికి అవసరమైన బియ్యం, నూనె, పప్పులు, తదితర సామగ్రి, ప్లేట్లు, గ్లాసులను అందిస్తున్నాం. వీటిని అందజేసినప్పుడు పెళ్లి కూతురుతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఆనంద పడుతున్నారు. ఇప్పటి వరకు 29 మంది సాయం అందించాం. ఒక్కో పెళ్లికి కనీసం రూ.20 వేలు నుంచి రూ.25 వేల ఖర్చు అవుతుంది. అయినప్పటికీ సేవా భావంతో చేస్తున్న ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.
– సుర్గి శ్రీనివాస్గౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు