అవి రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. నిరుపేద కుటుంబాలు. ‘తమ జీవితాలు ఇంతే.. పిల్లల భవిష్యత్ అయినా బాగుండాలి’ అని కష్టపడి చదివించినా భవిష్యత్కు భరోసా లేని గడ్డు పరిస్థితులు. ప్రభుత్వాలు ఎన్నిమారుతున్నా ఏండ్ల తరబడి ఉద్యోగాల భర్తీ లేక ఆగమైపోయిన కుటుంబాల కొలువుల కల స్వరాష్ట్రంలో నెరవేరింది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చీ రాగానే జంబో నోటిఫికేషన్లు వేస్తూ ఉద్యోగాలు కట్టబెట్టింది. గ్రూప్స్, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీ ఇలా ప్రతి శాఖలో దశాబ్దాలుగా భర్తీకి నోచుకొని వేలాది పోస్టుల్లో నియామకాలు చేపట్టగా, యువత కల నెరవేరింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు భరోసా దొరికింది. పైరవీలు, అవినీతికి తావులేకుండా కేసీఆర్ సర్కారు కృషితోనే తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని, తమ దశ తిరిగిందని తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం, క్రమంగా లక్ష్యం వైపు సాగడం, అనేక ఇక్కట్లను, నిర్బంధాలను దాటుకొని గమ్యాన్ని ముద్దాడడం తెలిసిన విషయమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడున్నర కోట్ల జనాల ఆశలు, ఆశయాల మధ్య కొలువుదీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలను సాధించేందుకు ఉపక్రమించింది. 1973 తర్వాత ప్రభుత్వాలు సర్కారీ రిక్రూట్మెంట్లను తగ్గించి వేయగా, 1989 తర్వాత పూర్తిగా నిలిపివేశాయి. 1989 తర్వాత దశల వారీగా ఉపాధ్యాయ ఉద్యోగాలు మినహా మరే పోస్టులనూ పెద్ద ఎత్తున భర్తీ చేసిన దాఖలాల్లేవు. దీంతో 1990-2014 మధ్య యువత ప్రభుత్వ ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వాల దుర్మార్గాన్ని గుర్తించిన బీఆర్ఎస్, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా నిరంతరం ఉద్యోగ భర్తీ ప్రక్రియ నిర్వహించాలనీ, రెగ్యులర్గా నోటిఫికేషన్లు జారీ చేయాలని భావించింది. అందుకు తగ్గట్లు మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 జూన్ 2 తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో పలు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలకు సర్కారు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు భర్తీ కూడా పూర్తి చేసింది.
పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, మిషన్ భగీరథ, రెండు పడక గదుల పథకాలను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు వందలాది ఇంజినీరింగ్ పోస్టుల నియామకం చేపట్టింది.
విశ్వవిద్యాలయాల నుంచి సాంకేతిక డిగ్రీ పట్టాను పొంది, బయట ప్రపంచంలోకి వచ్చిన యువత, సర్కారు ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నది. పాతికేళ్ల లోపు వయసులోనే అసిస్టెంట్ ఇంజినీర్లుగా, ఎస్ఐలుగా కానిస్టేబుళ్లుగా, వ్యవసాయాధికారులుగా ఉద్యోగాల్లో చేరిపోయారు. ట్రాన్స్కో, జెన్కోల్లోనూ ఉద్యోగాలు చేపట్టారు. ఐదువేల ఎకరాలను ప్రమాణికంగా తీసుకొని ఆయా రైతులకు సేద్య సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం 5వేల మంది ఏఈవోలను నియమించింది. ఇలా ప్రతిశాఖలోనూ ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివిన వారికి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించింది. ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా నిబంధనలను అనుసరించి అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఏ చిన్న పైరవీ లేకుండా, నయాపైసా అవినీతికి తావులేకుండా నియామకాలు చేసింది. రోజు కూలీ పనులు చేసుకొని కుటుంబాలు, మారుమూల అడవుల్లోని పూరిగుడిసెల్లో ఉండే కుటుంబాలు, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు ఎంతో మంది బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సర్కారు కొలువుల్లో చేరిన వివిధ ఉద్యోగుల కుటుంబాలను ‘నమస్తే తెలంగాణ బృందం కలిసి వారి అభిప్రాయాలను, అనుభూతులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు ఇలా స్పందించారు. సీఎం కేసీఆర్ సర్కారు కృషితోనే తమ పిల్లలకు ఉద్యోగాలు వరించాయని, పేద కుటుంబాలకకు ఆయనే శ్రీరామరక్ష అంటూ కొనియాడుతున్నారు.
పైరవీలు లేకుండానే ఉద్యోగం వచ్చింది
మాది సాధారణ రైతు కుటుంబం. నేను, నా భార్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మొన్న తెలంగాణ సర్కారు పోలీస్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసింది. నా కొడుకు సాయితేజ కూడా పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిండు. అన్ని పరీక్షల్లో పాసై పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యిండు. ఎటువంటి పైరవీలు లేకుండానే నా కొడుకుకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. పైరవీలతో కాకుండా మెరిట్ సాధించడం ద్వారానే నా కొడుకు ఉద్యోగం పొందడం సంతోషంగా ఉంది. మా లాంటి మధ్య తరగతి ప్రజలకు మంచి జరగాలంటే కేఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ గవర్నమెంట్ ఉంటేనే మంచిగుంటది.
-దొడ్ల ఎల్లారెడ్డి, రైతు, గంగాధర మండలం
పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు
ఉన్నత చదువులు చదివిన నాభర్త రేమిడి మల్లారెడ్డి సమైక్య పాలనలో ప్రభుత్వ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా, నేను ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగాలు చేసేటోళ్లం. ప్రతి నెల వచ్చే అరకొర ఆదాయంతో ఇబ్బందులు పడేటోళ్లం. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు అప్పగించగా, నా భర్త ఓ చోట, నేను ఓ చోట, నాపిల్లలు మరోచోట చదువుకుంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా మారాము. పదహారేళ్లుగా చేస్తున్న వెట్టిచాకిరికి తెలంగాణ ప్రభుత్వం విముక్తి కల్పించింది. తెలంగాణ ఆవిర్భావానంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నయా పైసా ఖర్చు లేకుండా నా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. ఇది సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. దేవుడి రూపంలో వచ్చిన సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో గతేడాది నుంచి మా కుటుంబమంతా ఒకే చోట నివసిస్తున్నాం. నగరానికి సమీపంలోని ప్రభుత్వ కళాశాలలో నా భర్త అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండు.
– రేమిడి శైలజ, ప్రభుత్వ అధ్యాపకుడు మల్లారెడ్డి భార్య (కరీంనగర్ జిల్లా)
పారదర్శకతతోనే ఇద్దరి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినై
పేద కుటుంబానికి చెందిన నా ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ పారదర్శకత వల్లే ఉద్యోగాలు వచ్చినై. తెలంగాణ ప్రభుత్వం ఒకే సారి 1032 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఎంతో పారదర్శకంగా ఉద్యోగాలకు ఎంపిక చేసిండ్రు. ఎలాంటి పక్షపాతం చూపకుండా ప్రతిభకు పట్టం కట్టిండ్రు. నా పెద్దకొడుకు మీసాల రాజు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగానే పోటీ పరీక్షలు రాసిండు. 2015లో గ్రూప్-2 పరీక్షలు రాయగా వాటి ఫలితాలు ఆలస్యంగా వచ్చినయి. అంతలోనే పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఉద్యోగాన్ని సాధించగా, అనంతరం గ్రూప్-2 ఫలితాలు కూడా విడుదలైనయి. ఈ ఫలితాల్లో ఏఎస్వో ఉద్యోగానికి ఎంపికైండు. చిన్నోడు 2016లోనే పోలీసు కానిస్టేబుల్ కోసం ప్రయత్నించుండు. కానీ ఎంపిక కాలేదు. అనంతరం 2019లో విడుదలైన నోటిఫికేషన్తో పోలీసు కానిస్టేబుల్గా ఎంపికైండు. ఉద్యోగం కావాలంటే కష్టపడాలే. తప్ప ఇంకా ఏదీ అక్కెర లేదని అని నా ఇద్దరు కొడుకులు నిరూపించిండ్లు.
-మీసాల లక్ష్మణ్, రైతు (మంథని)
నా కొడుక్కు పోలీస్ నౌకరి వచ్చింది
మాది బుగ్గారం మండల కేంద్రం. నా పేరు మసర్తి భూమవ్వ. మాకు ముగ్గురు పిల్లలు. నా భర్త మసర్తి పోచయ్య ఉపాధి కోసం 1999లో దుబాయ్ పోయిండు. మంచిగనే బతుకుతున్నం అనుకుంటున్న టైంల 2001లో ఆ దేశంలనే నా భర్త గుండెపోటుతో చనిపోయిండు. అప్పుడు పిల్లలు చిన్నోళ్లు. ఎదనిండ దుఃఖం. దేవుడు చిన్నచూపు చూసిండని చేసేదేమీలేక దుఃఖాన్ని దిగమింగుకొని కుటుంబ బాధ్యతలు మొత్తం మీద వేసుకున్న. ఎంతో కష్టపడ్డ. వ్యవసాయం చేసుకుంటూ నా ముగ్గురు పిల్లలను కసితోటి చదివించిన. అందరూ పెద్ద చదువులే చదివిండ్రు. నా పిల్లలను చదివించే టైంలో అందరు దెప్పి పొడిచే మాటలన్నరు. ‘గవర్నమెంట్ కొలువులు గిప్పుడు ఎక్కడివే, చదువుకు పైసలన్నీ ఖర్చుచేయబడితివి దండుగ అని’ అన్నరు. కానీ ఏ దేవుడన్న కనికరించడా అనుకొని వెనక్కి రాకుండా చదివించిన. నేను ఆశించినట్లుగానే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సారు సీఎం అయిండు. అపుడే అనుకున్న నా కొడుకుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తదని. చిన్న కొడుకు జీవన్ హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదివిండు. 2022లో పోలీసు నోటిఫికేషన్ అచ్చింది. నేనే నా కొడుకుకు చెప్పి ఉద్యోగానికి ఐప్లె చేయించిన. పరీక్ష రాసిండు. అక్టోబర్ 3న రిజల్ట్ వచ్చింది. నా కొడుక్కి కానిస్టేబుల్ నౌకరి అచ్చింది. చానా సంతోషమనిపించింది. కేసీఆర్ సారుకు, తెలంగాణ ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సీఎం కేసీఆర్ సారు మా పాలిట దేవుడు.
– మసర్తి భూమవ్వ, బుగ్గారం(ధర్మపురి)
కేసీఆర్ దయతోనే రైతు బిడ్డ పోలీసైండు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొలువులతోనే రైతుబిడ్డ పోలీసైండు. మాకు మూడు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటన్న. సీఎం కేసీఆర్ సార్ ప్రతీ ఏటా ఉద్యోగాలు ఏత్తండని డిగ్రీ సదువుకున్న నా కొడకు చందును మంచిగ సదువుకొమ్మని హన్మకొండలోనే ఉంచిన. 2018లో కానిస్టేబుల్, ఏఈవో పరీక్ష రాసిండు. మార్కులు తక్కువ అచ్చి ఉద్యోగం రాలేదు. అయినా పట్టువదలక సదువుకున్నడు. తెలంగాణ ప్రభుత్వం మళ్లా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పోస్టులు ఏసింది. రెండు పరీక్షలు రాసిండు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైండు. కాయాకష్టం జేసుకొని బతికే మాకు తెలంగాణ అస్తే పిల్లల బతుకులు బాగైతై అని అనుకున్నం, గట్లనే అయింది. నేను రైతును.. నా బిడ్డ పోలీసైండు. సీఎం కేసీఆర్ దయతోని రైతుల బతుకులు మారుడే గాదు మా బిడ్డల బతుకులు గూడ మారినై. నేను, నా కుటుంబ సభ్యులందరం సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం. – తడిగొప్పుల శ్రీనివాస్, రైతు, కనపర్తి (వీణవంక)
రాష్ట్రం రావడంతోనే మా కల నెరవేరింది
మాది జగిత్యాల అర్బన్ మండలం ధరూర్. నేను స్వర్ణకార వృత్తి పని చేస్త. నా భార్య ఇంటి పని చేస్తది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఉన్న దాంట్లో కూతురికి పెండ్లి చేసినం. పెద్ద కొడుకు మూగల హరీశ్ మెడికల్షాప్లో పని చేస్తండు. చిన్న కొడుకు నరేశ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉండెటోడు. బీటెక్ చేసిండు. తెలంగాణ గవర్నమెంట్ అచ్చిన తర్వాత నేను జాబ్ కొడ్తనే అనెటోడు. అన్నట్టే రాష్ట్రం అచ్చింది. జాబ్లు పడ్డయి. నా కొడుకు పోలీస్ కొలువు కోసం కష్టపడ్డడు. 2016ల కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిండు. కానీ, అప్పుడు రాలె. మళ్ల 2020ల ప్రిపేరైండు. అనుకున్నట్టే పోలీస్ కొలువు సాధించిండు. మా కాందాన్ల ప్రభుత్వ ఉద్యోగం చేసేటోళ్లే ఎవరు లేరు. నా చిన్న కొడుకు నరేశ్తో ఆ బాధ తీరింది. తెలంగాణ రావట్టే నా కొడుక్కి కొలువు అచ్చింది. మా కల నెరవేరింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నాకు గర్వంగా ఉన్నది. మా కొడుకు లెక్కనే ఎంతో మంది పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు గవర్నమెంట్ నౌకర్లు కొట్టిన్రు.
– మూగల వెంకటస్వామి, ప్రమీల దంపతులు (జగిత్యాల)