గంభీరావుపేట, ఫిబ్రవరి 23 : ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ అంటూ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం.. ఆ మహిళలనే ఇబ్బంది పెడుతున్నది. గతంలో రోడ్ల పక్కన చేయి ఎత్తితే బస్సులు ఆపినా.. ఇప్పుడు స్టాప్ ఉన్న చోట కూడా కొన్ని సార్లు ఆపడం లేదు. మహిళలకు ఫ్రీ కావడంతో బస్సులో ఎక్కించుకోవడం లేదు. సోమవారం గంభీరావుపేట మండలంలో కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రోడ్డుపై ఉన్న పెద్దమ్మ స్టేజీ బస్ స్టాప్ వద్ద సిరిసిల్ల వైపు వెళ్లే మహిళా ప్రయాణికులు బస్సు కోసం దాదాపు రెండుగంటలకుపైనే నిరీక్షించాల్సి వచ్చింది.
ఎక్స్ప్రెస్లు ఎక్కువగా వెళ్లాయని, ఆర్డినరీ బస్సులు తక్కువగా నడిచాయని, స్టేజీ పై ఉన్న 30 మంది మహిళలను చూసి ఏ ఒక్క ఆర్డినరీ బస్సును ఆపలేదని అక్కడ పిల్లలతో వేచి ఉన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారని వాపోయారు. సుమారు రెండు గంటల నిరీక్షణ తర్వాత ఒక్క బస్సును ఆపారని, కిక్కిరిసి ప్రయాణించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని, అటవీ ప్రాంతం లో ఉన్న పెద్దమ్మ స్టేజీ కూడలి వద్ద ఉన్న ఆర్డినరీ స్టాప్ను ఎక్స్ప్రెస్ స్టాప్గా అధికారులు మార్పు చేయాలని కోరుతున్నారు.