కోరుట్ల, మార్చి 4: క్యాన్సర్కు భయపడవద్దని, ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్, క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలు ఖరీదైన పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశ్యంతో క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అన్నివర్గాలకు అండగా ఉండే సంజయ్ వైద్య శిబిరం ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, క్యాన్సర్ వ్యాధి నిపుణుడు, ఫౌండర్ డాక్టర్ చినబాబు, వైద్యులు హేమంత్, ప్రణీత, నిజామాబాద్, కోరుట్లకు చెందిన ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
50 మంది వైద్యులు, 300 సిబ్బంది
క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరంలో సుమా రు 2 వేల మందికి పరీక్షలు చేశారు. గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు, 15 మంది క్యాన్సర్ వైద్య నిపుణులతోపాటు ప్రతిమ దవాఖాన, స్థానిక వైద్యులు మొత్తం 300 మంది సిబ్బంది వైద్య సేవలందించారు. కౌంటర్ల వద్ద సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న వారికి ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించారు.
పేదలకు సేవ చేయడం నా అదృష్టం
క్యాన్సర్పై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చు. మూ డేండ్ల క్రితం కోరుట్ల దవాఖానలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న ఎందరికో క్యాన్సర్ బయపటపడింది. ఈ నేపథ్యంలోనే ఈ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేశాం. అవసరమున్నవారికి హైదరాబాద్లో చికిత్స చేయిస్తాం. పేదలకు వైద్య సేవలందించడం నా అదృష్టం. త్వరలోనే మెట్పల్లి క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం.
– బీఆర్ఎస్ నేత డాక్టర్ కల్వకుంట్ల సంజయ్