ఫర్టిలైజర్సిటీ, జనవరి 19: ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గోదావరిఖని పట్టణంలోని గంగానగర్కు చెందిన పైడాకుల రవీందర్కు గత డిసెంబర్ 2న గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మీ మొబైల్ బ్లాక్ అవుతుందని, వెంటనే తాము పంపిన లింక్ ఓపెన్ చేసుకోవాలని’ సూచించారు. రవీందర్ లింక్ ఓపెన్ చేయగా తన అకౌంట్ నుంచి రూ.38 వేలు కాజేశారు.
డబ్బులు డ్రా చేసినట్టు ఫోన్కు మెస్సేజ్ రావడంతో వెంటనే డయల్ 1930, ఎన్సీఆర్సీ పోర్టల్కు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డాటా ఆధారంగా జార్ఘండ్ రాష్ట్రంలోని జత్తార జిల్లా తండాది గ్రామానికి చెందిన అస్రప్ అన్సారీ, తాజ్ముల్లా అన్సారీ, మనోజ్ మండల్, శేఖర్ మండల్గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సైబర్ క్రైమ్ సీఐ కరుణాకర్, గోదావరిఖని వన్టౌన్ ఎస్ఐ సుబ్బారావు, పోలీసులు, సీసీఎస్ పోలీసులు బృందంగా ఏర్పడి నిందితుల కోసం జార్ఘండ్కు వెళ్లి ఈ నలుగురిని అరెస్ట్ చేసి, ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గురువారం గోదావరిఖనిలోని ఒకటో అదనపు మున్సిప్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు.