తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారి తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాబోతున్నది. 126.74 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ముహూర్తం కుదిరింది. గురువారమే ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పట్టు విడువకుండా చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్వోబీకి కేంద్రం ప్రత్యేక నిధులేమీ కేటాయించకుండా.. సీఐఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన వాటా నుంచి మాత్రమే విడుదల చేయడం గమనించాల్సిన అంశం.
– కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్- మంచిర్యాల ప్రధాన రహదారి తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద రైళ్ల రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. నిజానికి ఆరంభంలో ఒకటి రెండు రైళ్లు మాత్రమే ఈ ట్రాక్పై నడిచినా.. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తికావడంతో ప్ర స్తుతం రద్దీగా మారింది. గతంలో వరంగల్, సికింద్రాబాబాద్ మీదుగా వెళ్లే చాలారైళ్లు ఇప్పు డీ ట్రాక్పై రాకపోకలు సాగిస్తున్నాయి. రైల్వే అధికారులు చెబుతున్న ప్రకారం చూస్తే. రోజు కు 12 నుంచి 15 రైళ్లు ఈ క్రాసింగ్ మీదుగా వెళ్తున్నాయి. అందులో ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో వెళ్తున్నవే. రైలు వచ్చి వెళ్లే సమయాల్లో ఈ క్రాసింగ్ వద్ద గేటు వేస్తుండగా, ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లడానికి 20 నిముషాలకుపైగా సమయం తీసుకుంటున్నది. దీంతో ఈ క్రాసింగ్ మీదుగా వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చాలా సందర్భాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోతున్నది. భవిష్యత్లో ఈ ట్రాక్పై రైళ్ల రాకపోకలు మరింత పెరగనున్నాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ పూర్తయితే ఈట్రాక్పై నుంచి ప్రతి 20 నిమిషాలకోసారి రైళ్లు వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రాసింగ్పై బ్రిడ్జిని మంజూరు చేయాలని 2014 నుంచి కోరుతున్నా కేంద్రం అంతులేని నిర్లక్ష్యం చూపింది. చివరకు బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం 2022 నవంబర్లో 126.74 కోట్లను కేటాయించింది. ఆ మేరకు టెండర్లు ఫైనల్ కాగా, ఆర్వోబీ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధక్షుడు వినోద్కుమార్ పాల్గొనున్నారు. నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రోడ్లు – భవనాల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలకు వినోద్ కుమార్ సూచించారు.
పట్టువదలకుండా పోరాటం
ఆర్వోబీ కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పట్టు విడువకుండా ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరు తూ 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి వినోద్కుమార్ లేఖ రాశారు. అప్పుడు స్పందించిన కేం ద్రం.. నిబంధనల ప్రకారం అనుకున్న స్థాయి లో క్రాసింగ్పై నుంచి వాహనాలు వెళ్లడం లేదని, అలాగే క్రాసింగ్పై నుంచి ఒకటి రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని, ఆర్వోబీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. ఇదే సమయంలో ఒక వేళ మున్సిపల్ పరిధిలో ఉంటే పై నిబంధనలు వర్తించని పేర్కొన్నది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ తీగలగుట్టపల్లిని కార్పొరేషన్లో వీలీనం చేశారు. తీగలగుట్టపల్లి కార్పొరేషన్లో కలువడానికి ఇదో ప్రధాన కారణం కూడా. దీంతోపాటు పెద్దపల్లి నుంచి నిజమాబాద్కు రైల్వేలైన్ పూర్తయిన తదుపరి ఈ ట్రాక్ రద్దీగా మారింది. గతంలో సింగరేణి బొగ్గు, సిమెంట్, పెట్రోలు, డీజిల్ వంటివి కాజీపేట- సికింద్రాబాద్- మేడ్చల్ మీదుగా నిజమాబాద్ వెళ్లేవి. కానీ, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు రైల్వైలైన్ పూర్తి కావడంతో ఇటు నుంచే రైళ్లను నడుపుతున్నారు. దీంతో రద్దీ పెరిగింది. ఆర్వోబీ ఏర్పాటు తప్పని సరికాగా.. వినోద్ కుమార్ కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాస్తూ వచ్చారు. మధ్యమధ్యలో రైల్వే బోర్డు చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
మన డబ్బులు మనకే..
కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్పై సెస్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగా వసూలు చేసిన నిధులు వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రావాలి. ఈ నిధులను గతంలో సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) పేరిట రాష్ర్టాల పరిధిలో రోడ్డు భవనాలశాఖ ఆధ్వర్యంలో ఖర్చు చేసేది. ఇప్పుడు కేంద్రం సీఆర్ఎఫ్ పేరును మార్చి సెంట్రల్ ఇన్ఫ్రాక్టర్ రోడ్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) అమలు చేస్తున్నది. ప్రస్తుతం ఆర్వోబీకి సీఐఆర్ఎఫ్ కింద నిధులు వచ్చాయి. నిజానికి సీఐఆర్ఎఫ్ కింద కావాల్సిన పనుల కోసం ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం గతంలో సూచించింది. ఆ మేరకు రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి 20 ప్రతిపాదనలు పంపగా, మొదటి ఐదు పనులకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో ఐదో పని తీగలగుట్టపల్లి ఆర్వోబీ. నిశితంగా చూస్తే.. మన డబ్బులే మనకు ఇస్తుందే తప్ప అదనంగా కేంద్రం డబ్బులను కేటాయించిన పరిస్థితులు మాత్రం లేవు.
నిరంతరం ప్రయత్నించాం
ఆర్వోబీ పరిధిలో రోజూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నించాం. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, గతంలో ఉన్న రైళ్ల పరిస్థితి, ప్రస్తుతం పెరిగిన రైళ్ల సంఖ్య, ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు లేఖల ద్వారా కేం ద్రం దృష్టికి తీసుకె ళ్లాం. కేంద్రం ప్రశ్నల కు పలుసార్లు సమాధానం ఇచ్చాం. కేంద్ర నిబంధనలను దృష్టి లో పెట్టుకొని తీగలగుట్టపల్లెను కార్పొరేషన్ లో విలీనం చేశాం. ఎలాగైనా ఆర్వోబీని ని ర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్లాం. నిజానికి కేంద్రం ఏనాడో నిధులు కే టాయించి ఉంటే.. ఈపాటికే బ్రిడ్జి ని ర్మా ణం పూర్తయ్యేది. ఏదేమైనా మా పో రాటం ఫలించి, చివరకు బ్రిడ్జి నిర్మాణం కాబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్ వాసులతోపాటు చొప్పదండివైపు వెళ్లే అనేక గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ సమస్య దూరమవుతుంది.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
కలిసి పోరాటం చేశాం
నిజానికి కరీంనగర్ను రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ నగరంలో లేని విధంగా అద్భుతమైన రోడ్లు, కేబుల్ బ్రిడ్జి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానేరు రివర్ఫ్రంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఊహలకు అందని విధంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతున్నది. నగర జనభా కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారిలో ఉన్న తీగలగుట్టపల్లి వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగింది. రాళ్ల రాకపోకలు కూడా భారీగా పెరిగాయి. ఆర్వోబీ కోసం వినోద్కుమార్తో కలిసి పోరాటం చేశాం. చివరకు మా కృషి ఫలించింది. బ్రిడ్జి నిర్మాణంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లవుతుంది.
– గంగుల కమలాకర్, రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి