స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్రగతితో ఇవాళ మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల హృదయాలను గెలిచిన గొప్ప నాయకుడు, మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి ఏడాది పొడవునా నీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. ఈ మేరకు సోమవారం మంత్రి గంగుల కమలాకర్ స్వగ్రామం వెల్గటూర్ మండలం పైడిపల్లిలో 14 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు అమాత్యులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. నాటి పాలనలో సాగు, తాగు నీరు, కరెంటు కోసం అరిగోసపడ్డామని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకున్నామని చెప్పారు.
– వెల్గటూర్, ఏప్రిల్ 3
వెల్గటూర్, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా మారుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. 14 వేల కోట్లు ఖర్చుపెట్టి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారని, ఇవాళ మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేవలం మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏడాదంతా నీరందిస్తున్నారని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెడితే 30 వేల కోట్లు ఇస్తామని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా, తనప్రాణం ఉన్నం త వరకు పెట్టేది లేదని మొండికేసి చెప్పడమే కాకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల హృదయాలను గెలిచిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి సోమవారం వెల్గటూర్ మండలంలోని పైడిపల్లికి రాగా, ఈ సందర్భంగా గ్రామంలో డప్పు, ఒగ్గు కళాకారులు, మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం 12కోట్లతో నిర్మించే అం బారీపేట నుంచి తాళ్ల కొత్తపేట రోడ్డు, కోటి 40 లక్షలతో పైడిపల్లి నుంచి పడకల్ రోడ్డు, 30లక్షలతో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మంత్రి గంగుల స్వగృహానికి చేరుకుని, వారి తండ్రి గంగుల మల్ల య్య పటేల్, అన్న ప్రభాకర్ పటేల్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అక్కడే, ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి దయాకర్రావు మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణ గ్రామాల అనేక మౌలిక సదుపాయాలను కల్పించిన ఘన త సీఎం కేసీఆర్కి దక్కిందని కొనియాడారు. నాడు సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామాలు సాగు, తాగు నీరుకు, కరెంటు లేక అరిగోస పడ్డాయని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించుకుని ఆ గోస తీర్చుకున్నామన్నారు. తాగు, సాగు నీరు అందించడమే కాకుండా 24 గంటలు ఉచిత విద్యుత్ను ఇస్తున్నారని తెలిపారు. ఇప్పు డు ఏడాది పొడువునా నీరందిస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, రైతుబంధు ఇచ్చి ఆదుకొని, పండించిన వరి ధాన్యాన్ని గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది నిజం కాదా..? అని గుర్తుచేశారు. ఇలాంటి ప్రభుత్వాలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని దోచుకుంటూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కాంగ్రెస్, బీజేపీని రాబోయే రోజుల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు.
కేంద్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మన రాష్ర్టానికి నిధులు ఇవ్వకపోగా కోతలు విధిస్తూ అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏదో సాధించినట్లు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వారికి పుట్టగతులు ఉండవని, అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాం టి వారిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎంపీల వల్ల రాష్ట్రానికి గానీ, వారి పార్లమెంట్ నియోజకవర్గాలకు గానీ ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, సర్పంచ్ గంగుల నగేశ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, జిల్లా కలెక్టర్ యాస్మిన్బాషా, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఎంపీటీసీ చాటకొల్లు రాజేశ్వరి, మాజీ ఎంపీపీ గంగుల అశోక్, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్గౌడ్, సింహాచలం జగ న్, జూపాక కు మార్, గుండా జగదీశ్వర్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఉపాధ్యక్షుడు పాక వేణుగోపాల్, కార్యదర్శి సత్యం, జిల్లా అధ్యక్షుడు సురమల్ల సతీశ్, మండలాధ్యక్షు డు కొప్పుల విద్యాసాగర్, తిరుపతి, లక్ష్మణ్ ఉన్నారు.
కన్న ఊరు రుణం తీర్చుకుంట
నేను పైడిపల్లిలో పుట్టి పెరిగిన. వృత్తి రీత్యా కరీంనగర్లో ఉన్న. ఈరోజు గ్రామానికి వస్తే గ్రామస్తుల ఆతిథ్యం, అభిమానం, స్వాగతం పలికిన తీరు మరిచిపోను. కన్న ఊరు రుణం తీర్చుకుంట. నాడు తెలంగాణ రాష్ట్రం రాక ముందు చెరువుల్లో నీరుండేది కాదు. చివరి ఆయకట్టుకు నీరు రాకపోయేది. బావుల్లో నీరు ఉండకపోయేది. కరెంటు కూడా ఉండేది కాదు. రైతులు పడని కష్టాలు లేవు. ఉపాధి కోసం దుబాయి లాంటి దేశాలకు వెళ్లిన్రు. రాష్ట్రం ఏర్పడ్డాక మన గోసలు తీరినయ్. గల గల పారే గోదారికి కాళేశ్వరం వద్ద కేసీఆర్ కాలు అడ్డుపెట్టిండు. మండుటెండలో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నయ్. పంటలు పుష్కలంగా పండుత్నునయ్. గిట్టుబాటు ధరకు ప్రతి గింజనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంబారిపేట నుంచి చెగ్యాం వరకు డబుల్ రోడ్డు కావాలని అడిగిన వెంటనే 14 కోట్లు మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లికి నా కృతజ్ఞతలు. గ్రామంలో అన్ని కులాలకు ఉపయోగపడేలా సొంతంగా భూమి కొని, ప్రభుత్వ సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఫంక్షన్ హాల్ నిర్మిస్త.
– మంత్రి గంగుల కమలాకర్
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపు ఉన్న (విజన్) గొప్ప నాయకుడు. ఆయన నాయకత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినయ్. దేశంలోని వంద గ్రామాల్లో 99 శాతం మన రాష్ట్రం నుంచి ఆదర్శంగా నిలుస్తున్నయ్. ఎర్రబెల్లి మన నియోజకవర్గానికి 70 కోట్లు మంజూరు చేసినందుకు నా కృతజ్ఞతలు.
– మంత్రి కొప్పుల ఈశ్వర్