మానకొండూర్, జనవరి 31: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే వారికి అధికారంలో ఉండే నైతిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. మానకొండూర్ మీనాక్షి కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి సర్పంచులకు శాలువా కప్పి, జ్ఞాపికలను అందచేసి సన్మానించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేసీఆర్ సర్కారు పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయని గుర్తుచేశారు. 2014లో రాష్ట్రం ఏర్పాటైందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, 2014 నుంచి 2023 వరకు ఒక లక్షా 60 వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో..? వివరంగా వెల్లడించామని, ఇది అందరికీ తెలుసునన్నారు. కానీ, అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేదని అబద్ధాలను ప్రచారం చేసి, నిజాన్ని నమ్మకుండా చేసి యువత జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చింది నిజమా.. కాదా ? రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. వారందరికీ జనవరిలో వేతనాలు ఇచ్చింది నిజమా కాదా..? చెప్పాలన్నారు. రేవంత్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే డిసెంబర్ 2024లోగా భర్తీ చేస్తామని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తాడో.. పత్రికా ముఖంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెల చివరి వరకు ఏ శాఖలో..? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాడో ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేస్తే యువత పోటీపరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ సర్కారు గతంలో 7వేల స్టాఫ్నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిందని, కానీ, ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు, ఉద్యోగాల భర్తీ నిలిచి పోయిందన్నారు. వారికి ఇప్పుడు రేవంత్రెడ్డి వారికి ఉద్యోగనియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువులు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ గట్టెపల్లి దీపక్కుమార్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్గౌడ్, నాయకులు ఎరుకల శ్రీనివాస్గౌడ్, శాతరాజు యాదగిరి, పడాల సతీశ్గౌడ్, దండబోయిన శేఖర్, రామగిరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.