సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 16: ఎంపీ బండి సంజయ్ మతోన్మాద రాజకీయాలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా, రైల్వే లైన్, జాతీయ రహదారులు తెచ్చానని చెప్పారు. కానీ, సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో విమర్శలు రాజకీయంగా ఉండాలి కానీ, వ్యక్తిగతంగా చేయకూడదని సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించలేవని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజయ్ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సమయంలో తనపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎల్అండ్టీని బెదిరించినట్టు చేసిన విమర్శలను తాను ఖండిస్తే ఆయన ఇప్పటి వరకు కనీసం స్పందించలేదన్నారు. హైదరాబాద్లో 500 కోట్ల ఆస్తి ఉందని ఆరోపణలు చేశాడని, నిరూపిస్తే ఆయనకే రాసిస్తానని సవాల్ విసిరారు.
రాజకీయ నాయకులు పార్టీ సిద్ధాంతాలపై మాట్లాడాలని, వ్యక్తిగత విషయాలపై స్పందించడం రాజకీయ చతురత కాదని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో గ్రామాలకు కోట్లాది రూపాయలు తెచ్చినట్టు బండి ప్రచారం చేసుకున్నాడని, అయితే.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 5 కోట్ల ఎంపీ నిధులు వస్తాయని, ఉపాధి హామీ పథకం, హరితహారం, అంగన్వాడీ, ప్రధాన మంత్రి సడక్ యోజనకు ఖర్చు చేసిన నిధులను ఫ్లెక్సీల్లో రూపొందించారని, దీంట్లో ఆయన ప్రత్యేకంగా చేసింది ఏముందో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదాతోపాటు వెయ్యి కోట్ల నిధులు సాధించానని గర్వంగా చెబుతున్నానన్నారు. 60 ఏండ్ల కరీంనగర్ ప్రజల ఆకాంక్ష అయిన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు చేయించానని, ఈ లైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తయ్యాయని, త్వరలోనే సిరిసిల్ల మీదుగా పనులు జరగబోతున్నాయన్నారు. ఎల్కతుర్తి- హుస్నాబాద్- మెదక్- పిట్లం జాతీయ రహదారిని తెచ్చామని, దీనికి భూసేకరణ పూర్తయి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
కరీంనగర్లో ఎస్సీ నేషనల్ హైవేస్ కార్యాలయం ప్రారంభించామని, కొత్తపల్లిలో ట్రిపుల్ఐటీ కాలేజీ కోసం కలెక్టర్ ద్వారా కేంద్రానికి లేఖ పంపామని చెప్పారు. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క నవోదయ విద్యాలయం మంజూరు చేయించలేకపోయారని మండిపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల మల్టీప్లెక్స్పై విమర్శలు చేశాడని, రాష్ట్రం మొత్తంలోనే ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్న సంస్థ అదొక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే మల్టీప్లెక్స్కు స్థలం కేటాయించారని, ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకావడం లేదని మండిపడ్డారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన అవసరముందని సూచించారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి రైతులకు 500ల బోనస్ ఇస్తున్నారో లేదో ఆయన అసెంబ్లీలో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి చివరి నుంచి వరి కోతలు ప్రారంభం కాబోతున్నాయని, ప్రతి క్వింటాల్కు బోనస్ చెల్లించేదాకా విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఎంఎస్పీకి అదనంగా బోనస్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, జక్కుల నాగరాజు, గజభీంకార్ రాజన్న, బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, వైస్ ఎంపీపీ శ్రీనాథ్గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు పాల్గొన్నారు.