సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 16 : ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కారును కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తంగళ్లపల్లిలో ఆటో డ్రైవర్లు చేపట్టిన బంద్కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్తో కలిసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లతో మాట్లాడారు.
గతంలో పదేళ్ల కిందట తాము ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, టాక్సీ రద్దు చేసి అండగా నిలిచామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు రోడ్డు పడ్డారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళలకు జీరో టికెట్ కాకుండా వారి ప్రయాణానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే బాగుంటుందని, బస్సులు లేకపోతే ఆ డబ్బులతో ఆటోలోనూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్ల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్, అక్కరాజు శ్రీనివాస్, మాట్ల మధు, సిలువేరి చిరంజీవి పాల్గొన్నారు.