కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 21 : పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిధులు తెస్తానని, కరీంనగర్ను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్నో అవకాశాలున్నా ఎంపీ బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్ల మోదీ పాలనలో ఐదేళ్లు తాను, ఐదేళ్లు సంజయ్ ఎంపీలుగా ఉన్నామని, తన ఐదేళ్ల పాలనలో ఏం చేశానో చెప్పానని, మరి ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు వద్దని, అభివృద్ధిపై అర్థవంతంగా చర్చిద్దామని సూచించారు.
అధికారం కోసమో, రాజకీయాల కోసమో రాలేదని, తాను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చానని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశ్యతో వచ్చానని చెప్పారు. గురువారం ఉదయం కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) గ్రౌండ్లో వాకర్స్ను కలుసుకొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండి సంజయ్ ఐదేళ్లు ఎంపీగా ఉన్నారని, కేంద్రంలో కూడా వారి పార్టీయే అధికారంలో ఉందని, ప్రత్యేకంగా నిధులు తెచ్చి పార్లమెంట్ను అభివృద్ధి చేసే అవకాశాలున్నా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. తాను సర్కస్ గ్రౌండ్ను సుందరంగా తీర్చిదిద్దానని, ఇప్పుడు ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్తోపాటు కుటుంబసభ్యులతో వచ్చి ఆనందంగా గడుపుతున్నారని పేర్కొన్నారు.
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో స్మార్ట్సిటీలో చేర్పించి రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. స్మార్ట్సిటీలో ఇప్పటికే 750 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైల్వే లైన్ ఉండాలని అప్పుడు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించామన్నారు. దీనికి సంబంధించి పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. జాతీయ రహదారుల హబ్గా కావాలన్న ఆలోచనతో సూపరింటెండెంట్ కార్యాలయాన్ని తీసుకువచ్చామని, రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేశామన్నారు. అలాగే, వరంగల్ నుంచి కరీంనగర్ రైల్వే లైన్ కోసం సర్వే చేయించామని, కానీ దురదృష్టవశాత్తు పనులు ప్రారంభం కాలేకపోయాయన్నా రు.
అభివృద్ధి చేయాలన్న ఆలోచన సంజయ్కి లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు త్రిపుల్ఐటీ తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేశామని, కానీ సంజయ్ ఎం పీగా గెలిచిన తర్వాత దానిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కరీంనగర్ను ఓ విద్యా హబ్గా మార్చాలని త్రిబుల్ ఐటీతోపాటు ఎన్సీఈఆర్టీ, ఐఐఎం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వాల రమణరావు, కుర్ర తిరుపతి, ఐలేందర్, కంసాల శ్రీనివాస్, నాయకులు దూలం సంపత్, జక్కుల నాగరాజు, శ్రీనివాస్, మధుసూదన్, తిరుపతి, మహేశ్ పాల్గొన్నారు.