కరీంనగర్ రాంనగర్, జనవరి 6: నేటి రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసిన మచ్చలేని, మహామనిషి మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కొనియాడారు. రాజకీయాల్లో ఎలాంటి కల్మషం లేని వ్యక్తిగా ఆయనకు పేరున్నదని, నిజాయితీగా ఉంటూ గెలుపోటములకు అతీతంగా పట్టుదలతో పని చేసిన వ్యక్తిగా ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు కుల్దీప్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘వినోద్కుమార్ సోదరుడి కుమార్తెకు జెన్కోలో అప్పటి సీఎండీ ప్రభాకర్రావు ఏఈ ఉద్యోగం ఇచ్చారు. లక్షన్నర జీతం తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే విధుల్లో చేరింది’ అంటూ విశాల్ హిందూ ఫేస్బుక్ ఐడీ పేరిట పోస్టు చక్కర్లు కొట్టగా.. పలు పోస్టులు సామాజిక మాధ్యమాల్లో శనివారం ఉదయం నుంచి వైరల్ అయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. తప్పుడు ఐడీలు సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా టూటౌన్లో ఫిర్యాదు చేశారు. ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని, అసలు వినోద్ కుమార్కు సోదరుడే లేడని అందులో స్పష్టం చేశారు. వినోద్కుమార్ను, బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కొత్తపల్లి, జనవరి 6 : వినోద్ కుమార్కు అన్న అంటూ ఎవరూ లేరని, అలాంటప్పుడు అన్న కూతురికి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించి జీతం ఇప్పిస్తున్నారని చెబుతున్న ఆరోపణలు పూర్తి అసత్యాలేనని కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, సుడా డైరెక్టర్ భూక్య తిరుపతినాయక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
నీతి, నిజాయితీకి మారుపేరు వినోద్కుమార్ అని, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. ఆరోపణలపై వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తరిమి కొడతామని హెచ్చరించారు.