చిగురుమామిడి, జనవరి 7: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ భరోసానిచ్చారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, భవిష్యత్ అంతా మనదేనని అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతం చేసి వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని ‘శుభం’ గార్డెన్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్దేనని కొనియాడారు. రాష్ర్టాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్కు అప్పగిస్తే, వారు అసత్యపు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం 7వేల కోట్ల నిధులను సిద్ధంగా ఉంచి రైతుల ఖాతాల్లో వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ అడ్డుకున్నదన్నారు. పదేళ్లలో 1.61లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి మరో 43వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చి చూపాలని సవాల్ చేశారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు గోపాల్రావు, పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, దేవేందర్రావు, ఎంపీపీ కొత్త వీనితా, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్రెడ్డి, సాంబారి కొమురయ్య, రామోజు కృష్ణమాచారి, మండల నాయకులు మంకు శ్రీనివాస్రెడ్డి, పెనుకుల తిరుపతి, రాంబాబు, ఎస్కే సిరాజ్, తిరుపతిరెడ్డి, వెంకటేశం, రాజేశం, సదానందం, తదితరులు పాల్గొన్నారు.