రామడుగు (చొప్పదండి), డిసెంబర్15: ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన సాగింది. కానీ కొన్ని శక్తుల దుష్ప్రచారంతో ఓడిపోయాం. పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు. కుంగిపోవద్దు. మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళదాం. వచ్చే స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదాం’ అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని రామడుగు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించగా, వినోద్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ కేసీఆర్ సార్ అంటే రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ జాతిపితగా అపారమైన గౌరవం ఉందన్నారు.
కానీ చిన్న, చిన్న లోపాలతోనే పార్టీ ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో దేశంలోనే రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవ రూ అధైర్యపడవద్దని, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షా న నిలబడదామని, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేద్దామని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.