కార్పొరేషన్, మార్చి 5 : కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీ వినోద్కుమార్, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు ఆది నుంచీ కరీంనగర్ అండగా నిలిచిందని, పార్టీ ఆరంభం కూడా ఎస్సారార్ కాలేజీ నుంచే జరిగిందని, కేసీఆర్ కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్న అద్భుతంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. అదే సెంటిమెంట్తో ఈ కళాశాల మైదానం నుంచే ఈ నెల 12న పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారని చెప్పారు. ప్రజలు మరోసారి కేసీఆర్ ఉండాలని ఆలోచించి ముందుకు వస్తున్నారన్నారు. మూడు నెలలకే కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు మొదలయ్యాయని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని గుర్తు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ‘గళం.. దళం.. బలం’ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్, నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్, గందె మహేశ్, పెండ్యాల మహేశ్, జక్కుల నాగరాజు, దూలం సంపత్, జమీలొద్దీన్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేసినట్టు? ఐదేళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క స్కూల్, ప్రాజెక్టును తేలేదు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే కేంద్రం ఏ విధంగానూ సహకారం అందించలేదు. అలాంటి ఎంపీలు ఉంటే ఏంది? లేకపోతే ఏంది? అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతం. కొట్లాడుతం. స్కూల్స్, ప్రాజెక్టులు తెచ్చుకుంటం. పార్లమెంట్లో తెలంగాణ గళం ఎంత అవసరం? బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఉండాలి? అనే విషయాలపై ఈ నెల 12న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలకు వివరిస్తరు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో సమస్యలు మొదలైనయి. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నయి. మేడిగడ్డ బ్యారేజీ 86 పిల్లర్లలో రెండు పిల్లర్ల వద్ద సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాదన్నట్లుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తున్నది. అదే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఇప్పటికే కాపర్ డ్యాం నిర్మించేది. నీటిని ఎత్తిపోసి సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసేది. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మరో నాలుగు నెలల తర్వాత ఆలోచిస్తామని చెబుతున్నరు. జూలైలో దోదావరి పొంగిపొర్లుతుంది. డ్యాం సేఫ్టీ అధికారులు మూడు నెలులగా ఏం చేస్తున్నరు? తప్పును గుర్తించేందుకు ఇన్ని నెలలు పడుతుందా..? ఇలాంటి వాటన్నింటిపై కేసీఆర్ కదనభేరి సభలో వివరిస్తరు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలిరావాలి. తెలంగాణ శ్వాస, ధ్యాసగా ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీతో గెలిపించాలి.
– బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ